Indian on Ukraine: ఉక్రెయిన్ లో  పౌర హత్యలు కలవరపెడుతున్నాయనీ,బుచా మ‌ర‌ణాహోమంపై స్వతంత్ర విచారణ అవసరమేన‌ని UN లోని భారత్ తేల్చి చెప్పింది. సామూహిక సమాధుల చిత్రాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉరితీయబడిన పౌరుల మృతదేహాలు, ఉక్రెయిన్ లోని బుచా లో నెల‌కొన్న‌ ప‌రిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. 

Indian on Ukraine: ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు త‌ట‌స్థ వైఖ‌రి ప్ర‌ద‌ర్శించిన భార‌త్ తీరు మారింది. ఉక్రెయిన్‌లోని బుచా ప‌ట్ట‌ణంలో పౌరుల ఊచ‌కోత ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. బుచాలో పౌరుల మార‌ణ హోమంపై స్వ‌తంత్య్ర ద‌ర్యాప్తు చేయాల‌న్న డిమాండ్‌కు భార‌త్ మ‌ద్ద‌తు ప‌లికింది. 

UN భద్రతా మండలిలో.. ర‌ష్యా బ‌లాగాలు బుచా ప‌ట్ట‌ణంలో పౌరుల ఊచ‌కోతకు పాల్ప‌డిన‌ట్లు వ‌చ్చిన వార్త‌లు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఈ మార‌ణ కాండ‌ను తీవ్రంగా.. నిస్సందేహంగా ఖండిస్తున్నామని, దీనిపై స్వ‌తంత్య్ర ద‌ర్యాప్తు చేయాల‌న్న డిమాండ్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నామ‌ని భార‌త రాయ‌బారి టీఎస్ తిరుమూర్తి తెలిపారు. తక్షణమేఉక్రెయిన్‌పై ర‌ష్యా దండయాత్ర‌ను నిలిపివేయాలని, శత్రుత్వాలను ముగించాలని పిలుపునిచ్చారు. 

ఉక్రెయిన్‌లో క్షీణిస్తున్న పరిస్థితిపై భార‌త్ తీవ్ర ఆందోళన చెందుతోందని తిరుమూర్తి పేర్కొన్నారు. సంక్షోభం యొక్క ప్రభావంతో ఆహారం, ఇంధన ఖర్చులు పెరిగిపోతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలపై యుద్దం ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతోంద‌ని అన్నారు. అమాయక మానవ జీవితాలు ప్రమాదంలో ఉన్నప్పుడు.. దౌత్యం మాత్రమే ఆచరణీయమైన ఎంపిక అని అన్నారు.

ఉక్రెయిన్‌లోని బుచా ప‌ట్ట‌ణంలో పౌరుల మృత‌దేహాల‌ను సామూహికంగా ఖ‌న‌నం చేయ‌డంపై ప్ర‌పంచ వ్యాప్తంగా నిర‌స‌న వెల్లువెత్తుతున్న‌ది. అంత‌ర్జాతీయ క్రిమిన‌ల్ కోర్టు ముందు ర‌ష్యాను నిల‌బెట్టాల‌ని, ర‌ష్యాకు వ్య‌తిరేకంగా మ‌రిన్ని ఆంక్ష‌లు విధించాల‌న్న డిమాండ్లు పెరిగాయి.

రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఉక్రెయిన్ లోని బుచా మర‌ణాహోమం చిత్రాలు అత్యంత దిగ్బ్రాంతిని క‌లుగ చేస్తున్నాయి. పాశ్చాత్య దేశాలు రష్యన్ దళాలను యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపించాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, NATO దేశాలు ఈ ప‌రిస్థితిపై భయాందోళనలు వ్యక్తం చేశాయి. అలాగే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ నేరస్థుడుగా పేర్కొంటూ.. ఈ హత్యలను యుద్ధ నేరంగా పేర్కొంటూ, యుద్ధ నేరాల విచారణ జరగాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ డిమాండ్ చేశారు. 

ఐరాస భ‌ద్ర‌తా మండ‌లిలో ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. ర‌ష్యాన్ యుద్ద‌ ట్యాంకుల కింద ఎంతో మంది పౌరులు నలిగిపోయారు, మహిళలు వారి పిల్లల ముందు అత్యాచారానికి గురయ్యారు. అత్యంత క్రూరంగా చంపబడ్డారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బుచాలో రష్యా సైన్యం క్రూరత్వం సృష్టించింద‌నీ, UN చార్టర్ ను అక్షరాలా ఉల్లంఘించబడిందని ఆరోపించారు. బుచాలో జరిగిన ఊచకోత అనేక ఉదాహరణలలో ఒకటి మాత్రమేన‌ని పేర్కొన్నారు.

Zelensky మొదటిసారిగా UN భద్రతా మండలిలో ప్రసంగించిన త‌రుణంలో ఉక్రెయిన్ వీధుల్లో పడి ఉన్న శవాల భయంకరమైన చిత్రాలు, కాలిపోయిన మృతదేహాలు, వివిధ ఉక్రేనియన్ నగరాల్లోని సామూహిక సమాధుల చిత్రాలను చూపించే వీడియోను ప్లే చేయమని కోరారు. చనిపోయిన వారిలో కొందరికి చేతులు వెనుకకు కట్టబడి, పిల్లలతో సహా మ‌హిళ‌ల నోరు మూయ‌బ‌డి ఉన్న‌ట్టు అనేక చిత్రాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ ఆరోప‌ణ‌ల‌ను క్రెమ్లిన్ తిరస్కరించింది. అవి నకిలీ చిత్రాలని వారిస్తోంది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. రక్షణ మంత్రిత్వ శాఖలోని నిపుణులు వాటిని నకిలీ ఫోటోలుగా.. న‌కిలీ వీడియోలుగా గుర్తించార‌ని తెలిపారు.