ఇమ్రాన్ కీలక నిర్ణయం.. పాక్ జైళ్ల నుంచి భారతీయుల విడుదలకు ఆదేశం..?
పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్తో సత్సంబంధాలు నెలకొల్పుతానని చెప్పిన మాజీ క్రికెటర్, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆ ప్రకారం నడుచుకుంటున్నట్లుగా తెలుస్తోంది
పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్తో సత్సంబంధాలు నెలకొల్పుతానని చెప్పిన మాజీ క్రికెటర్, తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆ ప్రకారం నడుచుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజునే పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న 27 మంది భారతీయులను విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం.
భారత్కు చెందిన 27 మంది మత్స్యకారులను ఆగస్టు 12న కరాచీ జైలు నుంచి లాహోర్కు తరలించనున్నారు.. అక్కడి నుంచి వాఘా సరిహద్దు ద్వారా భారతీయ అధికారులకు అప్పగించనున్నారు. బందీల జాబితా, ఎలా తీసుకురావాలి తదితర విషయాలకు సంబంధించి భారత్, పాక్ అధికారులు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని పత్రాలను సైతం సిద్ధం చేసినట్లుగా పాక్ అధికార వర్గాల సమాచారం.
మరోవైపు గత నెల 25 వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అధికారాన్ని అందుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ రాకపోవడంతో చిన్న చితకా పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 11న ఇమ్రాన్ ఖాన్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత సాదాసీదాగా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.