ఇమ్రాన్ ఖాన్ అరెస్టు, పాక్ అంతటా భారీ నిరసనలు..ఇద్దరు మృతి.. ఆర్మీ స్థావరంపై కూడా ఆందోళనకారుల దాడి
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను మంగళవారం అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ పీటీఐ నాయకత్వం నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నిరసనలు పాక్ లోని అనేక ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి.
అవినీతి ఆరోపణలపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు జరిగిన ఒక రోజు తరువాత కూడా పాకిస్తాన్ లో హింస చెలరేగింది. అరెస్టుకు నిరసనగా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన నాయకులు బుధవారం దేశవ్యాప్త సమ్మెను ప్రకటించారు. అవినీతి కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన 70 ఏళ్ల మాజీ క్రికెటర్, మాజీ ప్రధానిని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) ఆదేశాల మేరకు పారామిలిటరీ రేంజర్లు మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు గదిలోకి చొరబడి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ చీఫ్ అరెస్టు చట్టబద్ధమేనని, కానీ అది జరిగిన తీరు చట్టవిరుద్ధమని కోర్టు తీర్పునిచ్చింది. ఇస్లామాబాద్ పోలీసు చీఫ్, అంతర్గత కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించిన పీటీఐ నాయకత్వం బుధవారం దేశవ్యాప్త సమ్మెను ప్రకటిస్తూ.. పెరుగుతున్న ఫాసిజానికి వ్యతిరేకంగా వీధుల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు అని ‘డాన్’ వార్తాపత్రిక నివేదించింది.
కునో నేషనల్ పార్క్ లో లైంగిక హింసతో ఆడ చిరుత మృతి.. మూడు నెలల్లో మూడో మరణం
ఇమ్రాన్ ఖాన్ అరెస్టు వార్త వైరల్ కావడంతో దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. అతడి మద్దతుదారులు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ సహా భద్రతా సంస్థల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని లాఠీలతో దాడి చేశారు. పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ప్రధాన ప్రాంతాల్లో గుమిగూడడాన్ని నిషేధిస్తూ పోలీసులు సెక్షన్ 144 విధించినా కూడా.. దానిని ఆందోళనకారులు పట్టించుకోలేదు.
అయితే లాహోర్, పెషావర్, క్వెట్టా, కరాచీ, రావల్పిండిలో ఈ నిరసనల వల్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. చట్ట అమలు సంస్థలతో జరిగిన ఘర్షణల్లో కనీసం ఇద్దరు మరణించారని, డజన్ల కొద్దీ తమ కార్యకర్తలు గాయపడ్డారని పీటీఐ రాత్రికి రాత్రే ప్రకటించింది.