ఢాకా జైలునుంచి ఆదివారం ఓ తలారి విడుదలయ్యాడు. అతడు తన జీవితఖైదు శిక్షాకాలంలో తలారీగా పనిచేశారు. మొత్తం 26మందిని ఉరితీశాడు. 

ఢాకా : బంగ్లాదేశ్ జైలులో తలారిగా విధులు నిర్వహించిన ఓ వ్యక్తి ఆదివారం ఢాకా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యాడు. నిజానికి అతడు దోషిగా జైల్లో శిక్ష అనుభవించాడు. 1991లో దోపిడీ, హత్యా నేరాల కింద బంగ్లాదేశ్ కోర్టు షాజహాన్ భుయియాన్ అనే వ్యక్తికి 42 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత శిక్షలో భాగంగా అధికారుల ఆదేశాల మేరకు జైలులోనే తలారిగా విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో తన జైలు శిక్షకాలంలో 26 మందిని ఉరితీసాడు షాజహాన్ భుయియాన్. 

కాగా సత్ప్రవర్తన కారణంగా అతనికి పడిన 42 ఏళ్ల జైలు శిక్షలో పదేళ్ల శిక్ష తగ్గింది. దీంతో 74 యేళ్ల వయసులో షాజహాన్ భుయియాన్ ఆదివారం ఢాకా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యాడు. కాగా, అతను ఉరి తీసిన వారిలో బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్ హంతకులు కూడా ఉన్నారు. తలారిగా ఆయన అనుభవాలను ఒక మాటలో చెబుతూ… తాను ఉరితీసిన వ్యక్తుల్లో మునీర్ ను మరవలేనన్నాడు.

మునీర్ ను ఉరితీసేముందుచివరి కోరిక ఏమిటని అడిగితే ఓ సిగరెట్ ఇమ్మన్నాడని గుర్తు చేసుకున్నాడు. ఆదివారం తన విడుదల సందర్భంగా అతడిని మీడియా చుట్టుముట్టడంతో వారితో కాసేపు ముచ్చటించాడు. తనకు ఓ చెల్లెలు, మేనల్లుడు ఉండేవారని గుర్తు చేసుకున్నాడు. కాకపోతే గత 30 ఏళ్లుగా వారితో తాను మాట్లాడిందే లేదని చెప్పాడు. తనకు సొంత ఇల్లు కూడా లేదని.. జైలులో పరిచయమైన ఓ మిత్రుడు ఇంటికే వెళుతున్నానని చెప్పాడు. అంతేకాదు ప్రభుత్వం తనకు ఓ ఉద్యోగం చూపించాలని.. ఉండేందుకు ఓ ఆవాసం కూడా చూపించాలని కోరుకున్నాడు.