పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ జరిమానా పడింది. ఖైబర్ పంక్తుంక్వా ప్రావిన్స్లో స్థానిక ఎన్నికలకు రెండో విడత ఎన్నికలు ఈ నెల 31వ తేదీ నుంచి జరగాల్సిన తరుణంలో ప్రభుత్వ ప్రతినిధులు ప్రచారానికి రావద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ, వీటిని బేఖాతరు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ స్వాత్ పర్యటించి ప్రసంగించారు. దీంతో ఈసీ ఏకంగా పీఎంపై రూ. 50వేల జరిమానా విధించింది.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ గత కొన్ని రోజులుగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. అదీ తన పదవీ గండానికి సంబంధించే వార్తల్లోకి ఎక్కుతుండటం గమనార్హం. తాజాగా, మరోసారి అవాంఛనీయ కారణంతోనే వార్తల్లో కనిపించారు. ఏకంగా దేశానికే ప్రధానమంత్రిగా సేవలు అందిస్తున్న ఆయనపై భారీ జరిమానా పడటం పాకిస్తాన్లో సంచలనం రేపింది. ఔను.. ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించాడని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ఎన్నికల కమిషన్ ఏకంగా రూ. 50 వేల జరిమానా విధించింది.
పాకిస్తాన్లోని ఖౌబర్ పంక్తుంక్వా ప్రావిన్స్లో స్థానిక సంస్థల ఎన్నికలు రెండో విడత ఈ నెల 31వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఏరియాలో ప్రభుత్వ ప్రతినిధులు ఎవరూ పర్యటించడం గానీ, ప్రసంగాలు ఇవ్వడం కానీ చేయరాదని పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఆదేశించింది. స్వాత్ ఏరియాలో నిర్వహించే ఓ కార్యక్రమంలో ప్రసంగించరాదని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఈ నెల 15వ తేదీన ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కానీ, ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తర్వాతి రోజే స్వాత్లో పర్యటించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్... అక్కడ ప్రసంగం ఇచ్చారు. దీంతో ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది.
ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు రూ. 50 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చలానా రూపంలో కట్టాలని స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి కోసం ఎన్నికల సంఘం ఇమ్రాన్ ఖాన్కు రెండోసారీ నోటీసులు పంపింది.
ఖైబర్ పంక్తుంక్వా ప్రావిన్స్లోని మలాకండ్ ఏరియాలో ఈ నెల 21వ తేదీన ఓ రాజకీయ ర్యాలీని ఇమ్రాన్ ఖాన్ నిర్వహించారు. ఈ ర్యాలీకి సంబంధించి ఈసీ నోటీసులు పంపింది. ఈ ర్యాలీ నిర్వహించడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధాని ఖాన్తోపాటు ఈ ప్రావిన్స్ సీఎంకు, కేంద్ర మంత్రి అసద్ ఉమర్కూ ఈ జరిమానాలనే ఎన్నికల సంఘం విధించింది.
ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు, కేంద్ర మంత్రికి జరిమానాలు విధించడంతో ఇస్లామాబాద్ హైకోర్టులో ఎన్నికల సంఘం ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ పిటిషన్ ఫైల్ అయింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి కొత్త చట్టం వచ్చినప్పటికీ ఈసీ జరిమానాలు విధించిందని పిటిషన్ పేర్కొంది. కాగా, ఇస్లామాబాద్ హైకోర్టు.. జరిమానా విధించిన ఈసీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోబోం అని స్పష్టం చేసింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
మార్చి 28న ప్రతిపక్షాలు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నది. ఈ సందర్భంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. శుక్రవారం జరగనున్న అవిశ్వాస తీర్మానానికి ముందు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. తనను గద్దె దించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయని, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నానా విధాలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై పెట్టిన అవిశ్వాసంలో ప్రతిపక్షాలు నెగ్గవని ఇమ్రాన్ ధీమా వ్యక్తం చేశారు. చివరి అవకాశం వరకూ తాను వేచిచూస్తూనే వుంటానని, చివరాఖరుకు తాను ప్రతిపక్షాలకు షాక్ ఇస్తానని ప్రకటించారు.
