ఇండోనేషియాలోని బాలి, లోంబోక్ దీవుల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.0గా నమోదు అయ్యింది. అయితే ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టమూ జరగలేదు.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. బాలి, లోంబోక్ దీవులకు ఉత్తరాన సముద్రంలో మంగళవారం తెల్లవారుజామున భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0గా నమోదు అయ్యిందని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. ఇండోనేషియాలోని మాతారంకు ఉత్తరాన 203 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 516 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (ఈఎంఎస్సీ) తెలిపింది.
కాగా.. భూకంప తీవ్రత 7.1గా నమోదైందని, సునామీ ముప్పు లేదని ఇండోనేషియా, అమెరికా భౌగోళిక సంస్థలు అంచనా వేశాయి. బాలి, లోంబోక్ తీర ప్రాంతాల్లో తెల్లవారుజామున 4 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) భూకంపం సంభవించిందని, ఆ తర్వాత 6.1, 6.5 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది.
కొన్ని సెకన్ల పాటు సంభవించిన ఈ ప్రకంపనల వల్ల బాలిలోని మెర్క్యూరీ కుటా బాలిలోని ఉన్న టూరిస్టులు ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో తెలియక తమ గదుల నుంచి బయటకు పరగులు తీశారు. కానీ కొంత సమయం తరువాత వారు తిరిగి వచ్చారని ఓ హోటల్ మేనజర్ సువాదీ ‘రాయిటర్స్’ కు ఫోన్ ద్వారా తెలిపారు. భవనానికి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు.
ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని ఇండోనేషియా విపత్తు సంస్థ బీఎన్పీబీ తెలిపింది. భూకంపం లోతులో ఏర్పడిందని, అందుకే దీని వల్ల పెద్ద ప్రమాదం జరగలేదని పేర్కొంది.
