ఘోరం.. ఫిలిప్పీన్స్ లో పంజాబ్ దంపతుల దారుణ హత్య..
పంజాబ్ కు చెందిన ఇద్దరు దంపతులు ఫిలిప్పీన్స్ లో హత్యకు గురయ్యారు. ఆ దంపతులు ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరినీ కాల్చిచంపాడు.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో పంజాబ్ లోని జలంధర్ కు చెందిన ఓ జంట దారుణ హత్యకు గురైంది. వీరిని సుఖ్వీందర్ సింగ్ (41), కిరణ్ దీప్ కౌర్ (33)గా గుర్తించారు. సుఖ్వీందర్ సింగ్ గత 19 ఏళ్లుగా మనీలాలో ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన భార్య ఇటీవలే అక్కడికి వెళ్లారు. అయితే సుఖ్విందర్ సోదరుడు లఖ్వీర్ సింగ్ కూడా తన సోదరుడితో కలిసి నివసిస్తున్నాడు. కానీ ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన కుటుంబ కార్యక్రమం కోసం ఇండియాకు వచ్చారు.
సద్గురు జగ్గీ వాసుదేవ్ ను వాటర్ ఛాంపియన్ అవార్డు తో సత్కరించిన టెరి
కాగా.. సుక్వీందర్ తన పనులు ముగించుకొని సాయంత్రం సమయంలో ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో అతడు కూర్చొని ఉన్న సమయంలో గుర్తుతెలియని ఓ దుండగుడు ఒక్క సారిగా తుపాకీ తీసి బాధితుడిపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ కాల్పుల శబ్దం విని ఏం జరిగిందో చూద్దామని భార్య కిరణ్ దీప్ కౌర్ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. డోర్ దగ్గరికి చేరుకునే సరికే ఆ దుండగుడు ఆమెపై కూడా కాల్పులు జరిపారు. దీంతో బాధితురాలు చనిపోయింది. ఇదంతా వారి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
ఈ దంపతులు హత్యకు గురయ్యారని జలంధర్ లోని మెహసంపూర్ గ్రామంలో ఉన్న మృతుల కుటుంబాలకు సోమవారం సాయంత్రం సమాచారం అందింది. అయితే ఈ ఘటనపై లఖ్వీర్ ‘టైమ్స్ నౌ’తో మాట్లాడుతూ.. ఆదివారం నుంచి తన సోదరుడికి పదే పదే ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదన్నారు. దీంతో తాను తన మామయ్యని ఇంటికి వెళ్లి చూడాలని కోరాను.
ఆయన అక్కడికి వెళ్లే సరికే నా సోదరుడు, అతడి భార్య రక్తపు మడుగులో పడి ఉందని గమనించాడు. తమ కుటుంబానికి ఎవరితోనూ శత్రుత్వం లేదని లఖ్వీర్ అన్నారు. ఈ విషయాన్ని భారత అధికారులు ఫిలిప్పీన్స్ లోని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. దీంతో నేరానికి పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయవచ్చని తెలిపారు.