Gotabaya Rajapaksa: ఆర్థిక సంక్షోభం, పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ప్రజా నిరసనల మధ్య శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోయారు. అయితే, ఆయన అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
Sri Lanka economic crisis: ఆర్థిక సంక్షోభం, హింసాత్మక నిరసనల మధ్య ఈ ఏడాది జూలైలో దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే గ్రీన్ కార్డ్ కోసం యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు పలు మీడియా సంస్థల రిపోర్టులు పేర్కొంటున్నాయి. అమెరికాలో ఆయన కుటుంబం శాశ్వత నివాసం కోసం రాజపక్స న్యాయవాదులు దరఖాస్తును ప్రారంభించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
వివరాల్లోకెళ్తే.. తన రాజీనామాకు పిలుపునిస్తూ ప్రభుత్వ వ్యతిరేక భారీ నిరసనల మధ్య గత నెలలో దేశం విడిచి పారిపోయిన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే.. అమెరికాకు తిరిగి వచ్చి తన భార్య, కొడుకుతో అక్కడ స్థిరపడేందుకు US గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నట్లు మీడియా నివేదిక తెలిపింది. శ్రీలంక వార్తాపత్రిక డైలీ మిర్రర్ పేర్కొన్న వివరాల ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్లోని రాజపక్స న్యాయవాదులు అతని భార్య లోమా రాజపక్స యుఎస్లో ఉన్నందున దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైనందున గ్రీన్ కార్డ్ పొందేందుకు అతని దరఖాస్తు కోసం గత నెలలో ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించారని పేర్కొంది. 2019లో, 2019 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజపక్సే తన US పౌరసత్వాన్ని వదులుకున్నారు.
రాజపక్సే శ్రీలంక సైన్యం నుండి ముందస్తుగా పదవీ విరమణ పొందారు. 1998లో యునైటెడ్ స్టేట్స్కు వలస వెళ్ళే ముందు సమాచార సాంకేతిక రంగంలోకి వెళ్లారు. అతను 2005లో శ్రీలంకకు తిరిగి వచ్చాడు. ఈ ప్రక్రియలో ఇప్పుడు కొలంబోలోని అతని న్యాయవాదులు అదనపు పత్రాలను ఇక్కడ సమర్పించారని పేర్కొంది. ప్రస్తుతం తన భార్యతో కలిసి బ్యాంకాక్లోని ఒక హోటల్లో ఉన్న 73 ఏళ్ల మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే.. ఆగస్టు 25న శ్రీలంకకు తిరిగి వస్తారని, కనీసం నవంబర్ వరకు థాయ్లాండ్లో ఉండాలనే తన ప్రాథమిక ప్రణాళికను రద్దు చేసుకుంటారని నివేదిక తెలిపింది. రెండు రోజుల క్రితం, రాజపక్సే తన లాయర్లను సంప్రదించారనీ, భద్రతా కారణాల దృష్ట్యా థాయ్లాండ్లో మొదట ఊహించిన విధంగా స్వేచ్ఛను అనుమతించకపోవడంతో ఈ నెలాఖరులో శ్రీలంకకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు ఆ రిపోర్టులు పేర్కొన్నాయి.
బ్యాంకాక్కు చేరుకున్న తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా ఇంటి లోపలే ఉండాలని థాయ్ పోలీసులు గొటబయ రాజపక్సేకు సూచించారు. బ్యాంకాక్ పోస్ట్ వార్తాపత్రిక నివేదించిన ప్రకారం.. ఆయన ఉన్న హోటల్ వివరాలను అధికారులు వెల్లడించలేదు. అలాగే, రాజపక్సే భద్రత కోసం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సాధారణ దుస్తులలో బందోబస్తు కల్పిస్తున్నారు. కాగా, ఈ నెలలో ఆయన శ్రీలంకకు తిరిగి వచ్చిన తర్వాత, రాజపక్సేకు రాష్ట్ర గృహాన్ని, మాజీ అధ్యక్షుడికి కల్పించిన భద్రతను కల్పించడంపై మంత్రివర్గం చర్చిస్తుంది అని నివేదిక పేర్కొంది. రాజపక్సే గత నెలలో మాల్దీవులకు, ఆ తర్వాత సింగపూర్కు పారిపోయారు. అతను మెడికల్ వీసాపై సింగపూర్లోకి ప్రవేశించాడు. వీలైనంత వరకు అక్కడే ఉండటానికి రెండుసార్లు పొడిగించాడు. అతని వీసా మరింత పొడిగించబడనందున, రాజపక్సే, ఆయన భార్య థాయ్లాండ్కు బయలుదేరి వెళ్లారు. అయితే, ఇక్కడ ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు పాల్పడకూడదని థాయ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆయన కదలికలను పరిమితం చేయడంతో స్వదేశానికి తిరిగి వస్తారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
