ఐరోపాలో వరదలతో అతలాకుతలం: 168 మంది మృతి
ఐరోపాలో వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. జర్మనీ, బెల్జియంలలో వరదలతో జనం బిక్కు బిక్కుమంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మీర్ పర్యటించారు.సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బెర్లిన్: పశ్చిమ ఐరోపాలో వరదలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. జర్మనీ, బెల్జీయంలలో శనివారం నాటికి 168 మంది మరణించారని అధికారులు తెలిపారు.జర్మనీలోని అహర్విలర్ కౌంటీ, నార్త్ రైన్-వెస్ట్ పాలియా రాష్ట్రాల్లో 141 మంది మరణించారు. బెల్జియంలో 27 మంది చనిపోయారు. వరదల కారణంగా వందలాది మంది గల్లంతయ్యారు.
వరదల్లో భారీ వాహనాలు కూడ కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలకోసం సైన్యం రంగంలోకి దిగింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మీర్ పర్యటించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వందలాది మంది వరదల కారణంగా నిరాశ్రయులయ్యారు. వరదల కారణంగా ఏర్పడిన వ్యర్థాలను తొటగించడానికి ఇంకా సమయం పడుతుందని అధికారులు తెలిపారు. శనివారం నాటికి వదరలు తగ్గుముఖం పట్టాయి. వరదలు తగ్గిన తర్వాత నష్టం అంచనా వేసే అవకాశం ఉంది.వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రజలకు పునరావాసం కల్పించేందుకు జర్మనీ ఛాన్సిలర్ ఏంజెలా మెర్కెల్ బుధవారం నాడు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు.