ఆఫ్రికాలో ప్లేన్ క్రాష్.. టాంజానియాలో సరస్సులో కూలిన విమానం.. 26 మందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది
ఆఫ్రికా దేశం టాంజానియాలో ఓ ప్రైవేటు విమానం ఆ ఖండంలోనే అతిపెద్ద సరస్సు లేక్ విక్టోరియాలో కూలిపోయింది. 43 మంది ప్రయాణికులు ప్రమాద సమయంలో ఉన్నట్టు తెలుస్తున్నది. 26 మందిని కాపాడినట్టు అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం టాంజానియాలో విమాన ప్రమాదం సంభవించింది. లేక్ విక్టోరియాలో ఆ విమానం కూలిపోయింది. ఆ విమానం మొత్తంగానే సరస్సులో మునిగిపోయింది. దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న దార్ ఎ సలాం నుంచి 43 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం.. మరికొన్ని నిమిషాల్లో ల్యాండ్ కానుండగా ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ సిబ్బంది, స్థానికులు వెంటనే సహాయక చర్యల్లోకి దిగారు. 26 మంది ప్రయాణికులను కాపాడినట్టు అధికారులు తెలిపారు.
టాంజానియా దేశంలో అతిపెద్ద ప్రైవేటు వైమానిక సంస్థ ప్రెసిషన్. ఈ సంస్థకు చెందిన పీడబ్ల్యూ 494 అనే విమానం ఈ రోజు దార్ ఎ సలాం నుంచి ఆఫ్రికాలోనే అతిపెద్ద సరస్సు అయిన లేక్ విక్టోరియా పక్కనే ఉండే కగేరా రీజియన్కు బయల్దేరింది. మరికాసేపట్లో బుకోబా ఎయిర్పోర్టులో ల్యాండ్ కానున్న ఆ విమానం లేక్ విక్టోరియాలో కుప్పకూలింది. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు క్యాబిన్ సిబ్బంది సహా 43 మంది ప్రయాణిస్తున్నారు.
సరస్సులో కూలిపోవడానికి ముందు ప్రెసిషన్ విమానంలో ప్రమాదం జరిగిందని రీజినల్ పోలీసు కమాండర్ విలియం వాంపఘలే బుకోబా ఎయిర్పోర్టులో విలేకరులకు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ఉన్నారని రీజినల్ కమిషనర్ అల్బర్ట్ చాలమిలా తెలిపారు. తాము ఇప్పటి వరకు 26 మందిని కాపాడినట్టు వెల్లడించారు. వారిని హాస్పిటల్లో చేర్చినట్టు వివరించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని అన్నారు తాము పైలట్తో కమ్యూనికేట్ చేస్తున్నామని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.
Also Read: అరుణాచల్ ప్రదేశ్ లో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్.. ఇద్దరి మృతదేహాలు వెలికితీత..
ఈ ప్రమాదానికి సంబంధించి న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. విమానం పూర్తిగా నీట మునిగినట్టు ఆ వీడియో ద్వారా తెలుస్తున్నది. ఎమర్జెన్సీ వర్కర్లు ఆ విమానాన్ని క్రేన్లకు కట్టిన తాళ్ల ద్వారా నీటి నుంచి పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదంతో ప్రభావితం అయిన ప్రతి ఒక్కరికి తన సానుభూతి అని అధ్యక్షులు సామియా సులుహు పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నంత సేపు కొంత అర్ధరహిత వదంతులను పక్కనపెట్టాలని, ఈ ప్రమాదం నుంచి బయటపడానికి దేవుడు తమ వెంట ఉంటాడని తెలిపారు.