పాకిస్తాన్ లో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహించడం సాధ్యం కాదని ఆ దేశ ఎన్నికల సంఘం ఇమ్రాన్ ఖాన్ కు చెప్పింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని తెలియజేసింది. ఈ విషయాలను పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. 

చట్టపరమైన, రాజ్యాంగపరమైన, లాజిస్టికల్ సవాళ్ల కారణంగా మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించలేమని, అది సాధ్యం కాద‌ని ఎన్నికల సంఘం పాకిస్థాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ కు చెప్పింది. ఇలా ఎన్నిక‌ల సంఘం తన అసమర్థతను వ్యక్తం చేసినట్లు ఆ దేశ మీడియా మంగ‌ళ‌వారం వెళ్ల‌డించింది. 

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనపై అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కొట్టివేసిన కొద్ది నిమిషాల తర్వాత ఆయ‌న‌ ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్న‌ట్టు.. మూడు నెల‌ల్లో పోలింగ్ ఉండాల‌ని నిర్వహించాల‌ని సిఫార్సు చేయ‌డం ప్రతిపక్షాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 342 మంది సభ్యుల ఉన్న జాతీయ అసెంబ్లీని రద్దు చేసేలా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. 

కాగా పార్లమెంట్ దిగువసభలో మెజారిటీ కోల్పోయిన ప్రధాని ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరిస్తూ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై విచారణను పాకిస్థాన్ సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అయితే ఎన్నిక‌ల విష‌యంలో పాకిస్థాన్‌కు చెందిన డాన్ వార్తాపత్రిక వెల్ల‌డించిన వివరాల ప్రకారం.. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ఆ సంఘం సీనియ‌ర్ అధికారి తెలిపారు. నియోజకవర్గాల తాజా డీలిమిటేషన్ కారణంగా, ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంక్వాలో 26వ సవరణ ప్రకారం సీట్ల సంఖ్య పెరిగింది. జిల్లా, నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను తీసుకొచ్చారు. దీంతో ఇవ‌న్నీ ఇప్పుడు స‌వాళ్లుగా మారాయి. సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకానికి క‌నీసం ఆరు నెలల సమయం పట్టే అవ‌కాశం ఉంది. 

‘‘ డీలిమిటేషన్ అనేది చాలా సమయం తీసుకునే ఎక్స‌ర్ సైజ్. ఇక్కడ చట్టం అభ్యంతరాలను ఆహ్వానించడానికి ఒక నెల సమయాన్ని అందిస్తుంది ’’ అని సీనియర్ ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికల సామగ్రి సేకరణ, బ్యాలెట్ పత్రాల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ ఇతర స్వాభావిక సవాళ్లలో ఉన్నాయని ఆయ‌న చెప్పారు. 

ఎన్నిక‌ల కోసం చట్టం ప్రకారం దేశంలో అందుబాటులో లేని వాటర్‌మార్క్‌తో కూడిన బ్యాలెట్ పేపర్‌లను ఉపయోగించాల్సి ఉంటుంద‌ని ఆ అధికారి అన్నారు. అందువ‌ల్ల వాటిని దిగుమ‌తి చేసుకోవాల్సి ఉంటుంద‌ని అన్నారు. బ్యాలెట్ పేపర్‌లను అందించేలా చట్టాన్ని సవరించాలని అత్యున్నత ఎన్నికల సంఘం ప్రతిపాదించిందని ఆయన వెల్లడించారు. కాబ‌ట్టి బిడ్‌లను ఆహ్వానించడానికి, ఆర్థిక, సాంకేతిక కొటేషన్‌లను పరిశీలించడానికి కూడా కొంత సమయం అవసరమని అధికారి తెలిపారు. ఎన్నికల మెటీరియల్ కోసం దాదాపు 100,000 పోలింగ్ స్టేషన్లకు రెండు మిలియన్ స్టాంప్ ప్యాడ్‌లు అవసరమవుతాయని చెప్పారు.

చట్టపరమైన అడ్డంకులను ప్రస్తావిస్తూ.. ఎన్నికల చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఎన్నికల ప్రణాళికను ప్రకటించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని అధికారి తెలిపారు. ఈవీఎంల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) వినియోగించాలనే చట్టం, విదేశీ పాకిస్థానీలకు ఓటు హక్కు కల్పించాలన్న చట్టం కూడా ఇప్పుడు రంగంలోకి దిగిందని, వాటిని రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. బలూచిస్తాన్‌లో స్థానిక ప్రభుత్వ (ఎల్‌జీ) ఎన్నికల షెడ్యూల్‌ను కమిషన్ ఇప్పటికే ప్రకటించిందని అధికారి తెలిపారు. మే 29వ తేదీని పోలింగ్ రోజుగా నిర్ణయించిందని అన్నారు. పంజాబ్, సింధ్, ఇస్లామాబాద్‌లలో ఎల్‌జీ ఎన్నికలను నిర్వహించడానికి కూడా ప్రక్రియ జరుగుతోందని అధికారి తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలంటే ఎల్‌జీ ఎన్నికల ప్రణాళికను విరమించుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు. కాబ‌ట్టి ఈ కార‌ణాలన్నింటి వ‌ల్ల మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు నిర్వహించ‌డం క‌ష్టం అని అధికారి స్ప‌ష్టం చేశారు.