ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగేందుకు యూఏఈలోని ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నాయి. 

కరోనా మహమ్మారికి ఎట్టకేలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే.. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కి బయపడి చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలా మంది విముఖత చూపిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ పై అవగాహన పెంచేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

యూఏఈ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 27 లక్షల మందికి వ్యాక్సిన్ వేసింది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగేందుకు యూఏఈలోని ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి సహాయం అందిస్తున్నాయి. తాజాగా దుబాయిలోని బాబ్ అల్ షామ్స్ అనే రిసార్ట్ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. 

వ్యాక్సిన్ వేయించుకున్న కస్టమర్లకు తమ హోటల్‌లోని అన్ని బుకింగ్స్‌పై 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు ఉండనున్నట్టు ప్రకటించింది. దుబాయి హెల్త్ అథారిటీ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తోందని, వారికి సహాయంగా తాము ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్టు హోటల్ యాజమాన్యం తెలిపింది. తమ ఆఫర్ ద్వారా కొంత మంది అయినా తమంతట తామే వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుంటారన్న నమ్మకం తమకు ఉందన్నారు.