మళ్లీ కోవిడ్ విజృంభణ.. జపాన్ లో ఆరోగ్య వ్యవస్థ అతలాకుతలం
COVID-19: జపాన్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు అక్కడ 16,423,053 మంది కోవిడ్-19 బారినపడ్డారు. అలాగే, 36,302 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
కరోనా వైరస్: కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. పలు దేశాల్లో ఆందోళనకరంగా కొత్త కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. జపాన్ లోనూ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. దీంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
జపాన్ స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ప్రస్తుతం ఆ దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉంది. కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి. యావత్ ప్రపంచ కరోనా నుంచి కొలుకుంటోంది. జపాన్ లో సైతం ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితుల ప్రభావం తగ్గుతున్నదనే సమయంలో మళ్లీ వైరస్ విజృంభణ మొదలైంది. జపాన్లో గత నెలలో 6 మిలియన్లకు పైగా కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 11 రోజులలో తొమ్మిది రోజుల్లో 200 కంటే ఎక్కువ రోజువారీ మరణాలు సంభవించాయి. అక్కడ కొనసాగుతున్న కరోనా ఏడవ వేవ్ కారణంగా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని అక్కడి మీడియా పేర్కొంది. జపాన్ లో గురువారం రోజున రికార్డు స్థాయిలో 255,534 కొత్త కేసులను నమోదు చేసింది. 2020 ప్రారంభంలో కరోనా మహమ్మారి దేశాన్ని తాకినప్పటి నుండి ఒకే రోజులో కరోనా కేసుల సంఖ్య 250,000 దాటడం రెండవసారి అని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
అలాగే, కొత్తగా కరోనా వైరస్ తో పోరాడుతూ 287 మంది మరణించారు. దీంతో జపాన్ లో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 36,302 కు చేరుకుంది. ఆగస్టు 8-14 వరకు వారంలో 1,395,301 కేసులు నమోదయ్యాయి. వరుసగా నాలుగో వారంలో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదైన దేశాల్లో ఒకటిగా మొదటి స్థానంలో ఉంది. దక్షిణ కొరియా, అమెరికాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం జపాన్ లో కరోనా కేసులు పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాలు సైతం కరోనా వైరస్ పెరుగుదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జపాన్ లో తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్న చాలా మంది స్థానిక నివాసితులు ఇంట్లో ఐసోలేషన్ లో ఉంటున్నారు. అయితే తీవ్రమైన లక్షణాలతో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఆసుపత్రిలో చేరడానికి కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడి ఆస్పత్రులు కోవిడ్-19 రోగులతో నిండిపోయాయి.
జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఆగస్టు 10 నాటికి దేశవ్యాప్తంగా 1.54 మిలియన్లకు పైగా కరోనా సోకిన ప్రజలు ఇంట్లో నిర్బంధించబడ్డారు. కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి దేశంలో ఇదే అత్యధికం అని పేర్కొంది. సోమవారం నాటికి, కనగావా ప్రిఫెక్చర్లో కోవిడ్ బెడ్ వాడకం రేటు 91 శాతం, ఒకినావా, ఐచి, నాగసాకి ,షిజుయోకా, షిగాలో 80 శాతం, ఫుకుయోకాలో 70 శాతం ఉందని ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ హాస్పిటల్ బెడ్ ఆక్యుపెన్సీ రేటు పెరుగుతోందని దేశ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ NHK తెలిపింది. టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం దాని కోవిడ్-19 బెడ్ ఆక్యుపెన్సీ రేటు 60 శాతం కంటే తక్కువగా ఉందని ప్రకటించింది. అయినప్పటికీ, చాలా మంది స్థానిక వైద్య కార్మికులు కరోనా బారిన పడ్డారు. వారి సన్నిహితులు సైతం కరోనా బారినపడ్డ సంఖ్య పెరగడంతో సిబ్బంది కొరత వేధిస్తోంది.