నిత్యానంద ‘‘కైలాస’’లో అక్కాచెల్లెళ్లు: గుట్టు తెలిసినా అచేతనంగా పోలీసులు
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆశ్రమంలో కనిపించుకుండా పోయిన అక్కాచెల్లెళ్లు ప్రస్తుతం... ‘‘కైలాస’’లో ఉన్నట్లు గుజరాత్ పోలీసులు వెల్లడించారు.
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆశ్రమంలో కనిపించుకుండా పోయిన అక్కాచెల్లెళ్లు ప్రస్తుతం... ‘‘కైలాస’’లో ఉన్నట్లు గుజరాత్ పోలీసులు వెల్లడించారు. భారత్- కరేబియన్ సంస్కృతుల మేళవింపుతో కూడిన ‘‘చట్నీ మ్యూజిక్’’ అనే కళను అభ్యసిస్తూ.. వారిద్దరూ అక్కడ ప్రదర్శనలు కూడా ఇస్తున్నట్లు సమాచారం అందిందని ఉన్నతాధికారులు తెలిపారు.
అదే విధంగా కరేబియన్ దీవుల్లో నిత్యానంద కొనుగోలు చేసిన ‘‘కైలాస’’ నిర్వహణ బాధ్యతలు సైతం ఈ అక్కాచెల్లెళ్లు చూసుకుంటున్నట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు.
గతంలోకి వెళితే.. కర్ణాటకకు చెందిన జనార్థన శర్మకు నలుగురు కుమార్తెలు.. 2013లో వీరిని నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో చేర్పించారు తల్లిదండ్రులు. అయితే పేరెంట్స్కు సమాచారం ఇవ్వకుండానే వారిని 2019లో అహ్మదాబాద్లో ఉన్న యోగిని సర్వజ్ఞాన పీఠానికి పంపించారు.
ఈ విషయం తెలుసుకున్న జనార్థన శర్మ దంపతులు.. అహ్మాదాబాద్ ఆశ్రమానికి వెళ్ళగా వారిని నిర్వాహకులు అడ్డుకున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారి సాయంతో ఆశ్రమం లోపలికి వెళ్లి తమ కుమార్తెలను ఇంటికి తీసుకురాగా.. మేజర్లైన మరో ఇద్దరు కూతుళ్లు లోముద్ర శర్మ, నందిత వారితో వెళ్లేందుకు ఇష్టపడలేదు.
దీంతో బెదిరింపులకు లొంగిపోయి ఆశ్రమంలో ఉండిపోయిన తమ ఇద్దరు కుమార్తెలను అప్పగించాలని కోరుతూ శర్మ దంపతులు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే నిత్యానంద వారిని విదేశాలకు తీసుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ వ్యవహారంపై ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. నిత్యానందకు వ్యతిరేకంగా ఇంత వరకు తాము రెడ్ కార్నర్ నోటీసు పొందలేకపోయామన్నారు. ఇప్పుడు వాళ్లు ఒక వేళ కైలాసలో ఉన్న విషయం నిజమే అయినా.. వారిని తిరిగి భారతదేశానికి ఎలా వెనక్కి తీసుకురావాలో అర్ధం కావడం లేదన్నారు.
అప్పగింతపై ఏ దేశంతో సంప్రదింపులు జరపాలో అన్న విషయంపై స్పష్టత లేదని ఆయన తెలిపారు. కాగా ఆధ్యాత్మిక ముసుగులో మహిళలపై అకృత్యాలకు పాల్పడిన నిత్యానంద మనదేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.
ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి.. దానికి కైలాస అనే పేరు కూడా పెట్టాడు. అంతేకాక ఈ దేశానికి ఒక పాస్పోర్ట్, జెండా, జాతీయ చిహ్నాన్ని కూడా డిజైన్ చేయించాడు. అదే విధంగా ప్రధాన మంత్రిని, కేబినెట్ను కూడా ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నట్లు వెల్లడించాడు.