కరోనాతో అల్లాడుతున్న భారత్.. సరిహద్దుల్లో చైనా కుయుక్తులు, రాకెట్ లాంచర్ల మోహరింపు
కరోనా మహమ్మారి విలయతాండవంతో భారత్ వణికిపోతోన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మూడున్నర లక్షల కేసులు.. 4 వేల మరణాలతో ఇండియా దారుణ పరిస్ధితులను చవి చూస్తోంది. ఈ సమయంలో పొరుగుదేశంగా భారత్ పట్ల సానుభూతిని ప్రకటించడమో, చేతనైనంత సాయం చేయడమో వుండాలి
కరోనా మహమ్మారి విలయతాండవంతో భారత్ వణికిపోతోన్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మూడున్నర లక్షల కేసులు.. 4 వేల మరణాలతో ఇండియా దారుణ పరిస్ధితులను చవి చూస్తోంది. ఈ సమయంలో పొరుగుదేశంగా భారత్ పట్ల సానుభూతిని ప్రకటించడమో, చేతనైనంత సాయం చేయడమో వుండాలి. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్ధితుల్లోనూ చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది.
భారత సరిహద్దుల్లోకి ఆధునికీకరించిన రాకెట్ లాంచర్లను డ్రాగన్ తరలిస్తోంది. టిబెట్ వద్ద ఉన్న ఓ స్థావరంలో వీటిని మోహరిస్తోంది. ఇక్కడి షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ గాల్వన్ లోయకు సమీపంలోనే ఉంటుంది. గతేడాది గాల్వన్ లోయలో భారత, చైనా బలగాల మధ్య ఘర్షణలు జరిగి ఇరువైపులా ప్రాణనష్టం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
Also Read:ఓ వైపు కరోనాతో భారత్ విలవిల.. మారని డ్రాగన్ బుద్ధి, సరిహద్దుల్లో మళ్లీ అలజడి
యుద్ధ రంగంలో కీలకంగా భావించే రాకెట్ లాంచర్లను చైనా తరలించడం వ్యూహాత్మకమేనని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాకెట్ దాడులతో ప్రత్యర్థి పదాతి బలగాలను ఆత్మరక్షణలోకి నెట్టడం సాధ్యమవుతుంది.
షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ స్థావరానికి రాకెట్ లాంచర్ల తరలింపును చైనా అధికారిక మీడియా సంస్థ సీసీటీవీ వెల్లడించింది. ఇక్కడ మోహరించిన వాటిలో పీహెచ్ఎల్-03 రాకెట్ లాంచర్లు, శతఘ్నులు ఉన్నట్టు తెలుస్తోంది.