చైనాలో కరోనా కలవరం.. ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోందన్న అమెరికా విదేశాంగ శాఖ
చైనాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. చైనా జీరో కోవిడ్ విధానాలు ఎత్తివేయడం కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
చైనాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. చైనా జీరో కోవిడ్ విధానాలు ఎత్తివేయడం కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చైనాలో కరోనా కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే 2023లో కరోనాతో 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1.4 బిలియన్ల జనాభా చైనాలో తగినంతగా టీకాలు వేయలేదని.. వైరస్ సోకినవారికి చికిత్స చేయడానికి ఆరోగ్య సంరక్షణ సాధనాలు భారీ స్థాయిలో లేవని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే చైనాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అగ్రరాజ్యం అమెరికాతో పాటు, యూరోపియన్ దేశాలు జాగ్రత్తగా పరిశీస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఆర్థిక వ్యవస్థ, జీడీపీ పరిమాణాన్ని పరిగణలోకి తీసుకుంటే.. అక్కడ పెరుగుతున్న వైరస్ వ్యాప్తి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. అయితే కోవిడ్-19 వ్యాప్తిని చైనా పరిష్కరించగలదని భావిస్తున్నట్టుగా తెలిపారు.
ఎప్పుడూ కూడా వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పుడు అది పరివర్తన చెందే అవకాశం ఉందని నెడ్ ప్రైస్ అన్నారు. అలాంటప్పుడు వైరస్ ప్రతిచోటా ముప్పును కలిగిస్తుందని ఆయన అన్నారు.
ఇక, చైనా రాజధానిలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున కోవిడ్-సోకిన మృతదేహాల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. కోవిడ్ నియంత్రణలను ఆకస్మికంగా సడలించిన తర్వాత ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి. రాబోయే 90 రోజుల్లో చైనాలో 60 శాతానికి పైగా ప్రజలు కోవిడ్ బారిన పడతారని ఎపిడెమియాలజిస్ట్లు అంచనా వేస్తున్నారు.