రెండోసారి... క్వారంటైన్ లోకి వెళ్లిన యూకే ప్రధాని
తనను కలిసిన ఎంపీకి కరోనా సోకినట్లు తేలడంతో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ రెండోసారి క్వారంటైన్ లోకి వెళ్లాడు.
లండన్: కరోనా మహమ్మారి విజృంభణ యావత్ ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే వుంది. సామాన్య ప్రజలే కాదు దేశాధినేతలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తనను కలిసిన ఎంపీకి కరోనా సోకినట్లు తేలడంతో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ రెండోసారి క్వారంటైన్ లోకి వెళ్లాడు. గతంలోనూ ఆయన క్వారంటైన్ లో వున్న విషయం తెలిసిందే.
గతంలో బోరిస్ కరోనా బారినపడ్డారు. దీంతో ఆరోగ్యం క్షీణించి మూడురోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. చికిత్స అనంతరం కోలుకొని తిరిగి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం పలువురు ఎంపీలతో బోరిస్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ లీ అండర్సన్ కు తాజాగా కరోనా పాజిటివ్ గా తేలడంతో ప్రధాని అప్రమత్తమయ్యారు.
కోవిడ్ నిబంధనల ప్రకారం బోరిస్ పది రోజులపాటు క్వారంటైన్ లో వుంటారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతానికి ప్రధానికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని... అయినప్పటికి నిర్దారణ పరీక్ష చేయించామన్నారు.