బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామ చేశారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా బోరిస్ జాన్సన్ ప్రకటించారు. 

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామ చేశారు. మంత్రుల వరుస రాజీనామాలతో సంక్షోభం ఎదుర్కొంటున్న బోరిస్ జాన్సన్.. చివరకు రాజీనామా చేసేందుకు అంగీకరించారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం తాను ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే 10 Downing Street వెలుపల బోరిస్ జాన్సన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘నా విజయాల పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. కొత్త నాయకుడు వచ్చే వరకు నేను కొనసాగుతాను’’ అని తెలిపారు. అయితే బోరిస్ జాన్సన్ స్పీచ్ వినేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు టెన్ డౌనింగ్ స్ట్రీట్‌కు చేరుకున్నారు. 

అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే కన్జర్వేటివ్ పార్టీ సమావేశంలో అధికారికంగా కొత్త నాయకుడిని నియమించే వరకు జాన్సన్ అపద్దర్మ ప్రధానమంత్రిగా కొనసాగనున్నట్టుగా నివేదికలు వెలువడుతున్నాయి. ఇక, బోరిస్ జాన్సన్‌ను వరుస వివాదాలు చుట్టుముట్టడంతో.. గత కొన్ని రోజులుగా ఆయనకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆయన ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన సొంతపార్టీ నేతలు రాజీనామాల బాట పట్టారు. 

ప్రధానమంత్రి పదవి నుంచి జాన్సన్‌ వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఇద్దరు కేబినెట్‌ మంత్రులు రాజీనామా చేయగా బుధవారం మరో 15 మంది మంత్రులు వారితో జత కలిశారు. దౌత్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. ఇలా 50 మందిపైగా రాజీనామాలు చేశారు. తనకు బ్రహ్మాండమైన మెజార్టీ ఉన్నదని, ప్రధాని సీటును వదిలిపెట్టాల్సిన అవసరం లేదని సమర్థించుకున్నారు. అయితే క్రమంగా పరిస్థితులు చేజారుతుండటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు.