పెళ్లి వేడుకలో భారీ పేలుడు: 40 మంది దుర్మరణం
అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో భారీ పేలుడు సంభవించి 40 మంది మరణించారు. మరో వంద మంది దాకా గాయపడ్డారు.
కాబూల్: అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో భారీ పేలుడు సంభవించి 40 మంది మరణించారు. మరో వంద మంది దాకా గాయపడ్డారు.
రిసెప్షన్ కు వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకున్నట్లు చెబుతున్నారు. ఈ సంఘటన కాబూల్ కు పశ్చిమాన ఉన్న షహర్ - ఏ - దుబాయి వెడ్డింగ్ హాల్ లో జరిగింది. శనివారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 10.40 గంటలకు ఈ సంఘటన జరిగిందని అప్ఘనిస్తాన్ హోంశాఖ తెలిపింది.
ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే విషయం ఇంకా తెలియరాలేదు. పెళ్లి వేడుకలో దాదాపు 1,200 మంది ఉన్నట్లు వరుడి బంధువు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.
వెడ్డింగ్ హాల్ రెండంతస్థుల భవనం. సంఘటన జరిగిన సమయంలో వెడ్డింగ్ హాల్ క్రిక్కిరిసి ఉందని చెబుతున్నారు. ఆదివారం ఉదయం అంబులెన్స్ ల ద్వారా బాధితులను తరలించారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశాయి. కాబూల్ లో దాదాపు 5 మిలియన్ల మంది నివసిస్తున్నారు. తరుచుగా నగరంలో పేలుళ్లు సంభవించడం గత రెండేళ్లుగా ఆనవాయితీ అయింది.