చైనాను ముంచెత్తిన వరదలు: 25 మంది దుర్మరణం
చైనాను వర్షాలు వణికిస్తున్నాయి. చైనాలోని సెంట్రల్ ప్రావిన్స్ హెనాన్ లో సుమారు 25 మంది వర్షాలతో మరణించారు.
బీజింగ్: చైనాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వెయ్యేళ్లలో ఇంత పెద్ద వర్షపాతం నమోదు కాలేదని అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.చైనాలోని సెంట్రల్ ప్రావిన్స్ హెనాన్ లో సుమారు 25 మంది మరణించారు. లక్ష మందిని జెంగ్జూ ప్రాంతం నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పారిశ్రామిక ప్రాంతం, రవాణా, రైల్వే మార్గాలు వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఓ సబ్వేలో వరద నీరు చేరడంతో 12 మంది మరణించారు. మరో 500 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ వర్షం కారణంగా బీజింగ్ లో బస్సు సర్సీసులను నిలిపివేశారు.
వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సుమారు 25 మంది మృతి చెందగా, ఏడుగురు తప్పిపోయారని బుధవారం నాడు స్థానిక మీడియా తెలిపింది.వరదలు, వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ఇళ్ళు కూలిపోయాయి. రానున్న మూడు రోజుల పాటు మళ్లీ హెనాన్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చైనా ఆర్మీ రంగంలోకి దిగింది.శనివారం నుండి మంగళవారం వరకు జెంగ్జౌలో 617.1 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది ఏడాది వర్షపాతం సగటుకు సమానమని అధికారులు తెలిపారు.