ఫ్లైట్ గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసిన ప్యాసింజర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? (Video)
దక్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్లైన్స్కు చెందిన ఓ ఫ్లైట్ గాలిలో ఉండగానే ఓ ప్యాసింజర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ను ఓపెన్ చేశారు. దీంతో గాలి తుఫాన్లా లోనికి దూసుకువచ్చింది. ప్రయాణికులు శ్వాస తీసుకోవడానికి ఇక్కట్లు పడ్డారు.
న్యూఢిల్లీ: ఓ ప్రయాణికుడు ఫ్లైట్ ల్యాండ్ కాకముందే ఇంకా సుమారు 650 అడుగుల ఎత్తులో ఉండగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ను ఓపెన్ చేశారు. అంతే ఆ ఫ్లైట్ లోకి వేగంగా గాలి వచ్చేసింది. ఆ గాలి ఎంతలా ఉందంటే.. ఎవరైనా ఎదురుగా నిలబడి ఉంటే కొట్టుకుపోయేవారు. అంత వేగంగా వీచిన గాలితో విమానంలోని ప్రయాణికులకు ఊపిరి ఆడటం కూడా కష్టతరంగా మారింది. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత పలువురు ప్రయాణికులు హాస్పిటల్ పాలయ్యారు. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ను ఓపెన్ చేసి ప్యాసింజర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్కు 240 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ బస్ ఏ321- 200 బస్సు ల్యాండ్ అయింది. ఆ ఫ్లైట్ ల్యాండ్ కావడానికి ముందు అంటే సుమారు 200 మీటర్ల ఎత్తులో ఉండగానే ఓ ప్యాసింజర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ను మ్యానువల్గా లివర్ను ఉపయోగించి ఓపెన్ చేసినట్టు ఏషియానా ఎయిర్లైన్స్ ఏఎఫ్పీ న్యూస్ ఏజెన్సీకి తెలిపింది.
ఎవరూ ఊహించని ఈ ఘటనకు ప్రయాణికులు ఇబ్బందులపాలయ్యారు. చాలా మంది ప్రయాణికులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక సుమారు 9 మంది ప్రయాణికులను హాస్పిటల్కు తరలించారు.
ఫ్లైట్ సేఫ్గానే ల్యాండ్ అయిందని, ఇతర పెద్దగా డ్యామేజీ ఏమీ జరగలేదని ఏషియానా ఎయిర్లైన్స్ వివరించింది.
ఎమర్జెన్సీ ఎగ్జిట్ను ఓపెన్ చేసిన ప్యాసింజర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ను ఎందుకు ఓపెన్ చేశారా? అని ప్రశ్నిస్తున్నారు.