కాబూల్: నిజమైన అమెరికా హెచ్చరిక.. ఇటాలియన్ విమానంపై ఉగ్రవాదుల కాల్పులు, పైలట్ చాకచక్యం
కాబూల్ విమానాశ్రయానికి ఉగ్రదాడి ముప్పుపై ఇప్పటికే అమెరికా, యూకే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కాసేపటికే కాబూల్ ఎయిర్పోర్ట్లో ఇటాలియన్ విమానంపై కాల్పులకు తెగబడ్డారు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు
ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్పోర్ట్లో ఇటాలియన్ విమానంపై కాల్పులకు తెగబడ్డారు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పైలట్.. విమానాన్ని సురక్షితంగా తప్పించారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కాబూల్ నుంచి అధికారులు, జర్నలిస్టులను తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విమానాశ్రయానికి ఉగ్రదాడి ముప్పుపై ఇప్పటికే అమెరికా, యూకే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
కొద్ది రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైంది. దాంతో అక్కడి నుంచి తమ పౌరులు, సైనిక సిబ్బంది, శరణార్థుల తరలింపు ప్రక్రియను పశ్చిమ దేశాలు వేగవంతం చేస్తున్నాయి. ఆగస్టు 31 నాటికి బలగాల ఉపసంహరణ గడువుకు ముందు సాధ్యమైనంత ఎక్కువ మందిని తరలించాలని చూస్తుండడంతో... భారీగా ప్రజలు కాబూల్ విమానాశ్రయం సమీపంలో గుమిగూడుతున్నారు.
ALso Read:కాబూల్ విమానాశ్రయానికి ఉగ్రదాడి ముప్పు... అక్కడికి వెళ్లకండి.. : బ్రిటన్
ఈ క్రమంలోనే ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ‘భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయం సమీపంలో ఉన్న వారంతా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలి’ అని యూనియన్ స్టేట్ డిపార్ట్మెంట్ పౌరులను హెచ్చరించింది. ఆస్ట్రేలియా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విమానాశ్రయం వద్దకు వెళ్లొద్దని తన ప్రజలకు సూచించింది.