కాబూల్ ఎయిర్పోర్ట్ : నిమిషాల వ్యవధిలో రెండో బాంబు పేలుడు.. భారీగా మృతులు
కాబూల్ విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది. దీనిని ఆత్మాహుతి దాడిగా అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. బాంబు పేలుడు సంఘటనకు ముందు ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్పోర్ట్లో ఇటాలియన్ విమానంపై కాల్పులకు తెగబడ్డారు.
ఆఫ్గనిస్థాన్లో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. గురువారం కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద వరుస పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా హెచ్చరించిన 24 గంటల్లోపే ఈ పేలుళ్లు జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్ వెలుపల నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 11 మంది నాటో సైనికులు మరణించగా, భారీ సంఖ్యలో గాయపడినట్లుగా తెలుస్తోంది.
దీనిని ఆత్మాహుతి దాడిగా అమెరికా రక్షణ శాఖ భావిస్తోంది. ప్రాణనష్టం తదితర వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు పెంటగాన్ అధికారులు సమాచారమిచ్చారు. కాగా, కాబూల్ విమానాశ్రయం వద్ద దాడులు జరగొచ్చని ఉదయమే అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. బ్రిటన్, ఆస్ట్రేలియా సైతం ఈ హెచ్చరికలను సమర్థించాయి. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Also Read:ఆఫ్ఘనిస్తాన్: కాబూల్ ఎయిర్పోర్ట్లో భారీ పేలుడు.. పెంటగాన్ అప్రమత్తం
బాంబు పేలుడు సంఘటనకు ముందు ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్ ఎయిర్పోర్ట్లో ఇటాలియన్ విమానంపై కాల్పులకు తెగబడ్డారు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పైలట్.. విమానాన్ని సురక్షితంగా తప్పించారు. ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కాబూల్ నుంచి అధికారులు, జర్నలిస్టులను తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.