అబుదాబీలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. వందమందికి పైగా భారతీయులకు గాయాలు.. ఇద్దరు మృతి...
అబుదాబిలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 106మంది భారతీయులు గాయల పాలయ్యారు. వీరిలో ఇద్దరు మృత్యువాత పడ్డారని ఇండియన్ అంబసీ అధికారులు తెలిపారు.
అబుదాబి : UAE రాజధాని అబుదాబిలోని రెస్టారెంట్ లో సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడులో 106 మంది భారత ప్రవాసులు గాయపడినట్లు Indian Embassy అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అలాగే ఇద్దరు ప్రవాసులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒకరు భారత్ కు చెందిన వ్యక్తి కాగా మరొకరు పాక్ పౌరుడిని తెలిపారు. ఖలీడియా ప్రాంతంలోని ఫుడ్ కేర్ అనే రెస్టారెంట్ లో సోమవారం ఈ పేలుడు సంభవించింది. గాయపడిన వారిని అబుదాబీలోని వివిధ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
మంగళవారం అబుదాబి హెల్త్ డిపార్ట్మెంట్ కు చెందిన సీనియర్ అధికారులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.అబుదాబిలోని హెల్త్ డిపార్ట్మెంట్ చైర్మన్ అబ్దుల్లా బిన్ మొహ్మద్ అల్ హమద్, డీఓహెచ్ అండర్ సెక్రెటరీ డాక్టర్ జమాల్ మహమ్మద్ అలీ కాబీ గాయపడిన వారితో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్య సిబ్బందిని ఆదేశించారు.
కాగా, Saudi Arabiaలోని మక్కాలో విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన NRI ప్రమాదవశాత్తు ఓ భవనం మీదినుంచి పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం (మే 22న) జరిగింది. మృతుడిని మొహిద్దీన్ అజీజ్ గా గుర్తించారు. అతని స్వస్థలం హైదరాబాద్ లోని యాకుత్ పురా. గత పదేళ్ల నుంచి సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు. Jeddahలోని అజిజియా ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నట్లు అతని బంధువులు తెలిపారు.
Makkahలో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం కూడా డ్యూటీకి వెళ్లిన అజీజ్ పనిచేసే చోట ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి చనిపోయాడు. ఇక ఈ ఘటనపై భారత కాన్సులేట్, లోకల్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని స్థానికంగా ఖననం చేయనున్నట్లు అజీజ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా, మే 11న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి క్రాంతి కిరణ్ రెడ్డి దుర్మరణం చెందాడు. మిస్సోరి రాష్ట్రం వారెన్స్బగ్లో ఈనెల 7వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తెలుగు విద్యార్థి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు Kranti Kiran Reddy (25) ఎంఎస్ చదివేందుకు గత ఏడాది లోని మిస్సోరీ సెంట్రల్ యూనివర్సిటీ కి వెళ్ళాడు. ఈనెల 7వ తేదీన రాత్రి ఏడున్నర గంటలకు స్నేహితులతో కలిసి వెడుతుండగా వీరి కారును ఓ కంటైనర్ ఢీకొట్టింది.
డ్రైవర్ పక్కనే కూర్చున్న కిరణ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు మిగిలిన ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికాలోనే ఉంటున్న శ్రీనివాస్ రెడ్డి బావమరిది మంగళవారం సమాచారం ఇవ్వడంతో విషయం తెలిసింది. క్రాంతి కిరణ్ రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి రెండు, మూడు రోజుల్లో తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు బంధువులు తెలిపారు.