అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్: ట్రంప్ విజయానికి మోడీ నినాదం
హౌడీ మోడీ కార్యక్రమంలో హూస్టన్ వేదికగా డోనాల్డ్ ట్రంప్ ను గెలిపించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం ఇచ్చారు. దాదాపు 50 వేల మందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
హూస్టన్: హూస్టన్ వేదికగా హౌడీ మోదీ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం ఇచ్చారు. రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. భారతదేశం ట్రంప్ తో అత్యంత సన్నిహిత సంబంధాన్ని నెలకొల్పుకుందని ఆయన చెప్పారు.
చరిత్రను సృష్టించడం మనం వీక్షిస్తున్నామంటూ మోడీ వేదికను ట్రంప్ నకు అప్పగించారు. మోడీ అమెరికాకు మంచి మిత్రుడని, ఆయనతో వేదికను పంచుకునే అదృష్టం దక్కిందని ట్రంప్ అన్నారు. దాదాపు 50 వేల మంది ఎన్నారైలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
"మిస్టర్ ప్రెసిడెంట్, 2017లో మీ కుటుంబానికి నన్ను పరిచయం చేశారు. నేడు నా కుటుంబాన్ని మీకు పరిచయం చేసే గౌరవం దక్కింది" అని మోడీ అన్నారు.
ఇటీవలి సంవత్సరాల్లో రెండు దేశాలు తమ సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకుని వెల్లాయని, రెండు అతి పెద్ద ప్రజాస్వామ్యాల సంబరాల మహా భాగస్వామ్య హృదయ స్పందనలను ట్రంప్ హూస్టన్ లో ఈ ఉదయం వినగలుగుతున్నారని మోడీ అన్నారు.