నైజీరియాలోని నైజర్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 76 మంది చనిపోయారు. ఈ ఘటన పట్ల ఆ దేశ అధ్యక్షుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అనంబ్రా రాష్ట్రంలో పడవ బోల్తా పడటంతో 76 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ధృవీకరించారు. అక్టోబరు 7వ తేదీన 85 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న పడవ నైజర్ నదికి వచ్చిన వరదల వల్ల ఒక్క సారిగా పక్కకి ఒరిగిపోయింది. ఈ సమయంలో పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్తోంది.
దంచికొడుతున్న వానలు.. ఎన్సీఆర్ ప్రాంతాలతో పాటు యూపీలో స్కూళ్లకు సెలవు
ఈ ఘటన పట్ల ఆ దేశ అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ ఆదివారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ రాష్ట్రంలోని ఓగ్బారు ప్రాంతంలో వరదల కారణంగా 85 మంది ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది, అత్యవసర సేవలు 76 మంది మరణించినట్లు నిర్ధారించాయి’’ అని ఆయన తెలిపినట్టు ప్రెసిడెంట్ ఆఫీసు పేర్కొంది. బాధితులను ఆదుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఎన్నికలకు ముందు కర్ణాటకలో భారత్ జోడో యాత్ర తరహాలో మరిన్ని పాదయాత్రలు
‘‘ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాద ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. అయితే అంతకు ముందు నీటి మట్టం పెరగడం సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని ఎమర్జెన్సీ సర్వీస్ లు తెలిపాయి. ‘‘ నీటి స్థాయి చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో రెస్క్యూ ఆపరేషన్ చేయడం చాలా ప్రమాదకరం ’’ అని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (NEMA) ఆగ్నేయ కోఆర్డినేటర్ థిక్మన్ తానిము ‘ఎఎఫ్పీ’కి తెలిపారు. ఆ నదిలో నీటి మట్టం ఒక దశాబ్దం కిందటి కంటే దాదాపు పదోవంతు ఎక్కువగా ఉందని, ఇలాంటి వరదలు దేశంలో ఎన్నడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు.
కాగా.. రెస్క్యూ ఆపరేషన్ కోసం నైజీరియా వైమానిక దళం హెలికాప్టర్లను అందించాలని NEMA అభ్యర్థించింది. అయితే వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల నివాసితులను తరలించాలని అనంబ్రా రాష్ట్ర గవర్నర్ చార్లెస్ సోలుడో అధికారులను కోరారు. విపత్తులో ప్రభావితమైన వారికి ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. “ ఈ ఘటన పట్ల అనంబ్రా రాష్ట్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తోంది. బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను ’’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఓవర్లోడింగ్, స్పీడ్, పేలవమైన నిర్వహణ, నావిగేషన్ నియమాలను పట్టించుకోకపోవడం వల్ల నైజీరియాలో బోట్ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి 200 మిలియన్లకు పైగా జనాభా ఉన్న పశ్చిమ ఆఫ్రికా దేశంలోని అనేక ప్రాంతాలు వరదల వల్ల నాశనమయ్యాయి. ఎమర్జెన్సీ సర్వీస్ వివరాల ప్రకారం.. ఈ ఏడాది వరదల వల్ల 300 మందికి పైగా మరణించారు. దాదాపు 100,000 మంది నిరాశ్రయులయ్యారు.
నిరంతరం కురుస్తున్న వర్షాల వల్ల వ్యవసాయ భూములు, అందులో ఉన్న పంటలు కొట్టుకుపోయాయి. కోవిడ్ -19 మహమ్మారి, ఉక్రెయిన్లో యుద్ధం ప్రభావంతో పోరాడుతున్న ఈ దేశంలో ఆహార కొరత, కరువు పరిస్థితులు నెలకొన్నాయి.
