పాకిస్థాన్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాదాపు వెయ్యిమంది మృత్యువాత పడ్డారు. దీంతో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 

పాకిస్తాన్ : అత్యంత భారీ వర్షాలతో పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది. వరద ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 343 మంది చిన్నారులతో సహా 937 మంది మృతి చెందారు. దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రభుత్వం గురువారం నేషనల్ ఎమర్జెన్సీ (జాతీయ అత్యవసర పరిస్థితి) ప్రకటించింది. ఇక్కడి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం అత్యధికంగా సింధ్ ప్రావిన్స్ లో 306 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ లో 234 మరణాలు నమోదయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలో 185, పంజాబ్ ప్రావిన్స్లో 165 మంది మృతి చెందారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పాకిస్థాన్లో ఏటా ఆగస్టులో సాధారణ వర్షపాతం 48 మిల్లీమీటర్లు... కాగా ఈ ఏడాది దాదాపు 241 ఒక శాతం అధికంగా 166.8 మిల్లీమీటర్లు నమోదు కావడం గమనార్హం. వరదలతో అస్తవ్యస్తమైన సింధు, బలూచిస్తాన్ లలో ఏకంగా ఏడు వందల ఎనభై నాలుగు శాతం, 496 శాతం అధిక వర్షపాతం నమోదయింది. అసాధారణ వర్షాలు, ఆకస్మిక వరదలకు కారణామయ్యాయని పాక్ వాతావరణ మార్పులశాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ తెలిపారు. వరద పరిస్థితులపై గురువారం ఆమె మాట్లాడారు. సహాయక చర్యలు సమన్వయానికి ఎన్ డిఎంఏలో ప్రధాన మంత్రి శంషాబాద్ షరీఫ్ ‘వార్ రూం’ని ఏర్పాటు చేశారని తెలిపారు. 2010 నాటి వరదలతో పోలిస్తే దేశంలో ప్రస్తుత పరిస్థితులు అంతకంటే దారుణంగా ఉన్నాయన్నారు.

చైనా నిర్ణ‌యానికి యూఎస్ కౌంట‌ర్.. 26 చైనీస్ విమానాలను నిలిపివేసిన అమెరికా.. ఎందుకంటే ?

‘భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసమైంది. దాదాపు మూడు కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ఎడతెగని వర్షాలతో సహాయక చర్యలు కష్టతరంగా మారింది అని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు అంతర్జాతీయంగా దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ‘ఒక్క సింధ్ ప్రావిన్స్ లోనే ప్రజలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు పది లక్షల టెంట్ లు అవసరం, అదే బలూచిస్తాన్ లో లక్ష కావాలి. ఈ క్రమంలోనే వాటి సమీకరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆమె చెప్పారు.