గ్రీస్ లో 5.5 తీవ్రతతో భూకంపం.. సునామీ అనుమానాలు...!!
గ్రీస్ లో సోమవారం ఉదయం సంభవించిన భూకంపం సునామీ భయాల్ని రేకెత్తించింది. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని భూకంప హెచ్చరికల కేంద్రం కోరింది.
సోమవారం ఉదయం గ్రీస్లోని క్రీట్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 5.5 మాగ్నిట్యూడ్ గా నమోదయ్యింది. దీంతో సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. అందుకే తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించాలని కోరింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం, సోమవారం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.25 గంటలకు గ్రీస్లోని సిటియాకు ఈశాన్య దిశలో 60 కిమీ (37 మైళ్ళు) భూకంపం సంభవించింది.
ఇది 80 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమయ్యిందని స్వతంత్ర పర్యవేక్షణ సంస్థ తెలిపింది. భూకంప తీవ్రత సునామీకి దారితీసే ప్రమాదం ఉండడంతో తీర ప్రాంత ప్రజలు దూరంగా వెళ్లాలని, ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్లాలని సూచించింది. ఈ మేరకు సీస్మోలాజికల్ సెంటర్ ట్విట్టర్లో అనేక భద్రతా సూచలను కూడా పంచుకుంది. అయితే, గ్రీస్ అధికారులు దీనిమీద ఎలాంటి మెసేజ్ లు, ప్రకటనలు ఇంకా ప్రసారం చేయలేదు.
అయితే, ఉత్తర ఆఫ్రికా వరకు భూకంపం సంభవించినట్లు సమాచారం. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి నష్టాలు, ఆస్తి నష్టం జరగలేదు.భూకంపం సంభవించిన వెంటనే నెట్వర్క్లో డిమాండ్ కారణంగా క్రీట్లోని మొబైల్ ఫోన్ సిస్టమ్లు తాత్కాలికంగా ఓవర్లోడ్ అయ్యాయని స్థానిక నివేదికలు చెబుతున్నాయి.