అపార్ట్ మెంట్ లో కాల్పుల కలకలం... నలుగురు మృతి
కుటుంబీకుల్లో ఒకరు.. మిగతా వారిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకొని ఉండచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
న్యూయార్క్ నగరంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. క్వీన్స్ ప్రాంతంలోని ఆస్టోరియా సెక్షన్లో ఓ అపార్ట్మెంట్ భవనంలో ఓ ఐదేళ్ల బాలుడు సహా నలుగురు చనిపోయి కనిపించారు. అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో ఈ ఘటన జరగింది. ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు, ఐదేళ్ల బాలుడు మృతుల్లో ఉన్నారు. నలుగురి మృతదేహాలపై తుపాకీతో కాల్చిన గుర్తులున్నాయని న్యూయార్క్ పోలీసు విభాగం చీఫ్ ఆఫ్ డిటెక్టివ్స్ డెర్మోట్ షియా విలేకరులకు వెల్లడించారు. ఇవి హత్యలు అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుటుంబీకుల్లో ఒకరు.. మిగతా వారిని హత్య చేసి, ఆత్మహత్య చేసుకొని ఉండచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వారంతా అక్కడికక్కడే మరణించారని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారిలో ఓ వ్యక్తి గొంతు కూడా కోసి ఉందని తెలిపారు. ఘటనా స్థలంలో తుపాకీ లభ్యమైనట్లు చెప్పారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, ప్రస్తుతం విచారణ ప్రాథమిక దశలోనే ఉందని పోలీసులు వెల్లడించారు. మృతుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఘటనా స్థలంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి భద్రతా చర్యలు చేపట్టారు.