పాక్ లో ఆర్మీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి .. 21 మందికి తీవ్ర గాయాలు..
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో మంగళవారం ఆర్మీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 21 మంది సైనికులు గాయపడ్డారు. వారిని వెంటనే సైనిక ప్రథమ చికిత్స కేంద్రంలో చేర్చారని వర్గాలు తెలిపాయి. క్షతగాత్రులందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
పాకిస్థాన్లో సైన్యంపై దాడి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లో మంగళవారం ఆర్మీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడిలో 21 మంది పాకిస్థాన్ ఆర్మీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఉత్తర వజీరిస్థాన్లోని మీర్ అలీ బైపాస్ రోడ్లో ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని.. ఆత్మహుతి దాడి జరిగింది.
ఈ దాడిలో గాయపడిన జవాన్లను ప్రథమ చికిత్స కోసం సమీపంలోని సైనిక ఆసుపత్రికి తరలించామని, జవాన్లందరి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. ఆర్మీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్న ప్రాంతం ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ కాల్పుల విరమణ చేసినప్పటికీ, గిరిజన జిల్లాల్లో ఉగ్రవాదులు భద్రతా దళాలపై దాడులు చేస్తునే ఉన్నాయి. అయితే.. ఈ ఘటనపై ఏ సంస్థ కూడా ఇప్పటివరకు బాధ్యత వహించలేదు. అంతకుముందు సెప్టెంబర్ 25 న ఉత్తర వజీరిస్థాన్లోని ఇషామ్ ప్రాంతంలో సైనిక సిబ్బందిపై దాడులు జరిగాయి, ఇందులో ఇద్దరు సైనికులు మరణించారు.