నేపాల్లో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి
గత 24 గంటలుగా నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో 17 మంది మరణించారు.
గత 24 గంటలుగా నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో 17 మంది మరణించారు. ఈ మేరకు ఓ అధికారి వివరాలు వెల్లడించారు. వివరాలు.. గత కొన్ని రోజులుగా పశ్చిమ నేపాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన సుదుర్పాస్చిమ్ ప్రావిన్స్లోని అచ్చం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అచ్చం జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో కనీసం 17 మంది మరణించినట్లు జిల్లా అధికారి దీపేష్ రిజాల్ నిర్ధారించారు. ఈ ఘటనలో గాయపడిన 11 మందిని చికిత్స నిమిత్తం సుర్ఖేత్ జిల్లాకు విమానంలో తరలించినట్టుగా చెప్పారు.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతైనట్లుగా తెలిపారు. గల్లంతైన వ్యక్తుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల సంఖ్య పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విపత్తు కారణంగా ప్రావిన్స్లోని ఏడు జిల్లాలను కలిపే భీమ్దుట్ట హైవేపై కూడా రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనల కారణంగా అచ్చం జిల్లాలో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతింది.