ఇరాక్ లో భారీ బాంబ్ పేలుళ్లు... పదిమంది మృతి, 20 మందికి గాయాలు
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో శనివారం భారీ పేలుళ్ళ సంభవించారు. ఈ పేలుళ్లలో పదిమంది చనిపోగా మరో 20 మంది తీవ్రగాయాలతో హాస్పిటల్లో చికిత్సపొందుతున్నారు.
ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించాయి. రాజధాని బాగ్దాద్ లోని ఫుట్ బాల్ స్టేడియం సమీపంలోని రద్దీ ప్రాంతంలో బాంబుదాడులకు తెగబడ్డారు. ఈ బాంబ్ పేలుళ్లలో పదిమంది మృతిచెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఓ వాహనంలో బాంబ్ అమర్చి తూర్పు బాగ్దాద్ లోని రద్దీ ప్రాంతంలో పేలుళ్లకు పాల్పడ్డారు. ఇదే సమయంలో ఓ గ్యాస్ ట్యాంకర్ అక్కడ వుండటంతో అదికూడా పేలడంతో ప్రమాదతీవ్రత మరింత పెరిగిందని ఇరాక్ ఆర్మీ తెలిపింది. మృతులు, గాయపడిన వారిలో చాలామంది చిన్నారులు వున్నట్లు తెలుస్తోంది. ఈ పేలుళ్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.