ప్రపంచ వ్యాప్తంగా ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు అనేక కంపెనీలు ఎగిరే ట్యాక్సీలను తయారు చేస్తున్నాయి. అలాంటి వాటిలో టాప్ లో ఉండే కంపెనీ జోబీ ఏవియేషన్. ఇప్పుడు టయోటా ఈ కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టింది. అంటే త్వరలోనే ట్యాక్సీలు వచ్చేస్తాయన్న మాట.
ప్రపంచంలోనే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటైన టయోటా మోటార్ కార్పొరేషన్, అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ స్టార్టప్ జోబీ ఏవియేషన్ ఇంక్లో తాజాగా 250 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడి ద్వారా టయోటా, జోబీలో 15.3 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా మారింది.
మొత్తం పెట్టుబడి 894 మిలియన్ డాలర్లు
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, ఈ పెట్టుబడి ఇప్పటికే ప్రకటించిన 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీలో భాగంగా ఉంది. తాజా పెట్టుబడి అనంతరం టయోటా మొత్తం పెట్టుబడి 894 మిలియన్ డాలర్లకు చేరింది. మిగిలిన 250 మిలియన్ డాలర్లు ఈ ఏడాది చివర్లో అందించనున్నట్లు సమాచారం.
కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్ కేంద్రంగా తయారీ
జోబీ ఏవియేషన్, కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థ నగరాలలో ప్రయాణాల కోసం బ్యాటరీతో నడిచే ఎగిరే ట్యాక్సీలను (eVTOL – electric Vertical Takeoff and Landing vehicles) అభివృద్ధి చేస్తోంది. 2026 నాటికి దుబాయ్ లో కమర్షియల్ ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించడమే ఈ కంపెనీ లక్ష్యం.
ఇప్పటికే 2020లో టయోటా తన వెంచర్ క్యాపిటల్ ద్వారా జోబీలో పెట్టుబడులు ప్రారంభించింది. తాజా పెట్టుబడితో టయోటా స్వాధీనంలో ఉన్న వాటా, జోబీ CEO వద్ద ఉన్న వాటాకు మించి ఉందని సమాచారం.
పెరిగిన షేర్ల విలువ
ఈ పెట్టుబడి వార్తలతో జోబీ షేర్లు 3.5% మేర పెరిగాయి. ఈ నేపథ్యంలో టయోటా నార్త్ అమెరికా CEO టెట్సుయో 'టెడ్' ఒగావా మాట్లాడుతూ, "ఈ మైలురాయి మా రెండు సంస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది" అని అన్నారు.
ప్రపంచ రవాణా రంగాన్ని దిద్దుబాటు చేసే శక్తిని కలిగి ఉన్న ఎగిరే ట్యాక్సీల రంగంలో టయోటా ఈ పెట్టుబడి ద్వారా తన స్థానం చిరస్థాయి చేసుకుంటోంది.
ఈ పెట్టుబడులు టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా టయోటా తన ప్రస్తుత ఆటోమొబైల్ వ్యాపారానికి మించిన వైవిధ్యమైన రంగాల్లోనూ అడుగుపెడుతోంది.