సైబర్ నేరాలను కొత్తపుంతలు తొక్కించిన తెలంగాణ యువకుడు
కొత్త తరహా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఓ యువకున్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: ఆ యువకుడు పెద్దగా చదవుకోలేదు. టెక్నాలజీ గురించి తెలిసింది అంతంతమాత్రమే. అయినా ఎదుటివారిని మాటలతో బుట్టలతో పడేయడంలో దిట్ట. దీంతో తనకున్న కొద్దపాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఇలా సామాన్యులనే కాదు ఏకంగా ప్రజాప్రతినిధులను బురిడీ కొట్టించి లక్షల్లో దండుకున్నాడు. ఇతడి లీలలు తెలిసి పోలీసులే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కరీంనగర్ జిల్లా తాడిచెర్ల గ్రామానికి చెందిన మధు అనే యువకుడు ఇంటర్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాటుపడి చదువు మానేశాడు. ఏ పనిపాట లేకుండా తిరగడం ప్రారంభించాడు. అయితే జల్సాల కోసం డబ్బులు కావాలి కాబట్టి ఈజీగా మనీ సంపాందించడం ఏలాగని ఆలోచించి చివరకు సైబర్ నేరాల బాట పట్టాడు.
మొదట వరంగల్ ను తన మోసాలకు అడ్డగా ఎంచుకున్నాడు. ఆ జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ జడ్పిటీసి, ఎంపీటిసిలను ప్రభుత్వం నుండి రూ.5 నుండి రూ.10 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందేలా చూస్తానని... అందుకోసం తనకు కొంత డబ్బు చెల్లించాలని చెప్పేవాడు. అతడి మాటలునమ్మిన కొందరు డబ్బులు చెల్లించి మోసపోయిన వారు చివరకు పోలీసులను ఆశ్రయించడంతో మధు జైలుపాలయ్యాడు.
జైలునుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రవర్తన మార్చుకోకుండా ఈసారి హైదరాబాద్ ను అడ్డాగా ఎంచుకున్నాడు. బీమా పాలసీలకు రుణాలిప్పిస్తానని, కాలం చెల్లిన పాలసీలకు డబ్బులు తెప్పిస్తానని, ప్రధానమంత్రి పథకాల కింద ప్రోత్సాహకాలు ఇప్పిస్తామంటూ సామాన్యులకు ఫోన్లు చేసి నమ్మించేవాడు. అతడి మాటలు నమ్మి కొందరు డబ్బులిచ్చి మోసపోయారు.
అయితే ఈసారి మధు పోలీసులకు దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. డబ్బులు చేతికందగానే అప్పటివరకు ఉపయోగించిన సిమ్ కార్డును మాత్రమే ఫోన్ ను కూడా మార్చేవాడు. దీంతో అతడి ఫిర్యాదులు అందినా అతన్ని పట్టుకోవడం పోలీసులకు కాస్త కష్టమయ్యింది.
ఇలా ప్రజలను మోసగించి సంపాదించన డబ్బుతో మధు జల్సాలు చేసేవాడు. తరచూ విమానంలో గోవాకు వెళ్ళి ఎంజాయ్ చేసేవాడు. అలాగే హైదరాబాద్ లోని స్టార్ హెటల్లలో బస చేసేవాడు. అయితే అతడి పాపం పండి ఇటీవల పోలీసుల చేతికి చిక్కాడు. అతన్ని విచారించగా పైన తెలిపిన మోసాలన్ని బయటపడ్డాయి.