విమానాన్ని గాల్లో చక్కర్లుకొట్టిస్తూ... ఫైలట్ అవతారమెత్తిన కేటీఆర్
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా ఫైలట్ అవతారమెత్తి విమానాన్ని ఆకాశంలో చక్కర్లు కొట్టించారు.
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన ప్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ ను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఫైలట్లకు శిక్షణనిచ్చేందుకు కేంద్ర విమానయాన శాఖ అనుమతితో ఎఫ్ఎస్టీసీ శిక్షణా కేంద్రం హైదరాబాద్ వెలిసింది. ఇప్పటివరకు కేవలం గురుగ్రామ్ లో మాత్రమే ఈ శిక్షణా కేంద్రం వుండగా రెండోది హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు.
ఈ శిక్షణాకేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ ఫైలట్ అవతారమెత్తారు. శిక్షణావిమానం కాక్ పీట్ లో కూర్చుని ట్రైనర్ సూచనల మేరకు కాస్సేపు విమానాన్ని నడిపారు. ఇలా కేటీఆర్ పైలట్ గా మారి కాస్సేపు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... భవిష్యత్ లో విమానయాన రంగం మరింత అభివృద్ది చెందుతుందన్నారు. ఈ రంగంలో పెట్టుబడులు భారీగా పెట్టెందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారని... ఇది శుభ పరిణామమన్నారు. ఈ శిక్షణా సంస్థ రాకతో శిక్షణా సౌకర్యాలు పెరిగడమే కాదు పరిశ్రమ అభివృద్ధి, యువతకు మంచి అవకాశాలు పెరుగుతాయని కేటీఆర్ తెలిపారు.