కేవలం కరోనా వల్లే కాదు... హైదరబాద్ లో కర్ణాటక వాసి మృతిపై కేంద్ర మంత్రి
సంపూర్ణ ఆరోగ్యవంతులపై కరోనా వైరస్ ప్రభావం అంతగా వుండదని కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ తెలిపారు. ఈ మరణాలను చూసి ప్రజలు పెద్దగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
హైదరాబాద్: మొదట చైనాను... ఆ తర్వాత ప్రపంచాన్ని... ఇప్పుడు భారత్ ను వణికిస్తోంది కరోనా మహమ్మారి. మన దేశానికే పొరుగునే వున్న చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు తొందరగానే వ్యాపించింది. అయితే చివరకు భారత్ లోకి కూడా ప్రవేశించిన ఈ వైరస్ ఇప్పటికే ఇద్దరిని పొట్టనపెట్టుకుంది. ఈ వైరస్ వల్ల చోటుచేసురకున్న ఈ మరణాలపై కేంద్ర విమానయాన శాఖమంత్రి హరిదీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంపూర్ణ ఆరోగ్యవంతులపై ఈ వైరస్ ప్రభావం అంతగా వుండదని తెలిపారు. కరోనాబారిన పడి ఇప్పటివరకు చనిపోయిన ఇద్దరూ వృద్దులేనని... అంతేకాకుండా వారు ఇతర ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. వారి అనారోగ్య సమస్యలకు ఈ వైరస్ జతకలవడమే మృతికి కారణమన్నారు. ఈ మరణాలను చూసి ప్రజలు పెద్దగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
read more కరోనా వార్...వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దృష్టికి కేసీఆర్...: భట్టి విక్రమార్క
హైదరాబాద్ లో జరుగుతున్న వింగ్స్ ఇండియా-2020 ఎయిర్ షో లో హరీదీప్ సింగ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇతర దేశాల నుండి కరోనా వ్యాప్తి చెందకుండా విమానాశ్రయాల్లో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి విమానయాన మంత్రి వివరించారు. మొదట్లొ ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా వున్న 12 దేశాల నుండి వచ్చేవారికే స్క్రీనింగ్ చేశామని... ప్రస్తుతం విదేశాల నుండి ఎవరు వచ్చినా చేస్తున్నామని అన్నారు.
ఇప్పటివరకు వివిధ దేశాల నుండి వచ్చిన 12 లక్షల మందికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేసినట్లు తెలిపారు. ఇందులో ఒకశాతానికి తక్కువమందికి మాత్రమే కరోనా వూరస్ సోకినట్లు తేలిందన్నారు. ఈ వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో మరింత ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు హరీదీప్ సింగ్ వెల్లడించారు.