కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  

కడప స్టీల్‌ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరఫరాపై జగన్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ), ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో ఈ ఒప్పంద కార్యక్రమం జరిగింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జగన్‌ సమక్షంలో అవగాహన ఒప్పందంపై ఎన్‌ఎండీసీ డైరెక్టర్‌(కమర్షియల్‌) అలోక్‌కుమార్‌ మెహతా, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ సీఎండీ పి.మధుసూదన్‌ లు సంతకాలు చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ...ఎన్‌ఎండీసీతో ఒప్పందం చరిత్రాత్మకమన్నారు.కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు ఈ ఒప్పందం తోడ్పాటునందిస్తుందని తెలిపారు. 

కడపతో సహా రాయలసీమ ప్రజల సుదీర్ఘకల నెరవేర్చడానికి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నానని జగన్‌ అన్నారు. ఎన్‌ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరా కోసం కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు.అందుకు పలితమే ఈ అవగాహనా ఒప్పందమన్నారు.

ఏడాదికి 5 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఎన్‌ఎండీసీ విశాఖ స్టీల్ ప్లాంట్ కు సరఫరా చేయనుంది. ఉక్కు ఉత్పత్తి ఖర్చును తగ్గించే చర్యల్లో భాగంగా తొలివిడతలో ప్లాంటు సమీప ప్రాంతాలనుంచి ఐరన్‌ఓర్‌ను సరఫరా చేయాలని ఎన్‌ఎండీసీని ప్రభుత్వం కోరింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఎన్‌ఎండీసీ డీజీఎంలు కొడాలి శ్రీధర్, డీ.కె.కుందు, ఎస్‌.ఎం. వి.కార్తీక్‌ లతో పాటు మరికొందరు అధికారులు పాల్గొన్నారు.