యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనాను ఎదుర్కోవడంతో తెలంగాణ సర్కార్ చాలా బాగా పనిచేసిందని... కానీ ఏపి ప్రభుత్వంలో ఇంకా చలనమే లేదని జనసేన నాయకులు అన్నారు. 

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 10 నెలల కాలంలోనే పాలించడం చేతకాక అబాసుపాలయ్యిందని జనసేన అధికార ప్రతినిధి చల్లపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. స్థానికసంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేయడం మంచిది కాదన్నారు. ఇలాగే ఈసీని బెదిరించాలని చూసిన వైసిపి ప్రభుత్వం చివరకు సుప్రీంకోర్టు చేత అక్షింతలు వేయించుకుందని అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇక కరోనా అనేది ప్రపంచంలో అనేకదేశాల ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే ముఖ్యమంత్రి జగన్ మాత్రం నిర్లక్షంగా బ్లీచింగ్ పౌడర్, పారాసీటమల్ వేసుకోవాలని సూచించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎంతో జాగ్రత్తలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేస్తే ఇక్కడ ప్రభుత్వంలో మాత్రం ఇంకా చలనం లేదన్నారు. పదే పదే 151 సీట్లు వచ్చాయి అని చెప్పే వైసీపీ నాయకులు స్ధానిక ఎన్నికల్లో ఎందుకు ప్రలోభాలకు, భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ప్రశ్నించారు. 

read more ఇంద్రకీలాద్రిని తాకిన కరోనా సెగ... కనకదుర్గమ్మ దర్శనాలు బంద్

ఈసీ ఇప్పటి వరకు జరిగే ఎన్నికల పక్రియను రద్దు చేసి కొత్తషెడ్యూల్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తమ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందుగానే వైసీపీ పార్టీకి ఓటు వేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారని... ఇప్పుడు అదే జరుగుతోందని శ్రీనివాస్ అన్నారు.

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బోణిబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... స్ధానికసంస్ధల ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంవల్లే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే కమిషనర్ ను బెదిరించారని....అయితే గతంలో ఎన్నికల కమిషనర్ అధికారులను మార్చితే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు.

కరోనా వైరస్ ప్రపంచమొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోందని... ఈ వైరస్ నిరోధానికి వైసిపి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. గొర్రెలమందలగా ముఖ్యమంత్రి ఏం చెబితే ఆ విదంగా మాట్లాడటం తప్ప ఇంగితజ్ఞానం లేనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వైసిపిలో ఉన్నారని విమర్శించారు. 

కరోనాపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. జనసేన కార్యకర్తలు మాస్కుల్ తయారుచేసి పేదప్రజలకు పంపిణీ చేయాలని సూచించారు. ఈ ప్రభుత్వానికి పేదల ఆరోగ్యంపై చిత్తశుద్ధి లేదు కాబట్టి మన ప్రజలను మనమే కాపాడుకుందాం అని జనసేన కార్యకర్తలకు శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.