టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటన సందర్భంగా గందరగోళం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబుపై జరిగిన దాడిపై సీనియర్ నాయకులు అచ్చెంనాయుడు సీరియస్ అయ్యారు.  

విజయవాడ: ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధానిని రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశానికి‌ చూపించాలనే తమ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనను చేపట్టినట్లు టిడిపి శాసనసభాపక్ష ఉపనేత అచ్చెంనాయుడు తెలిపారు. ఇలా రాష్ట్ర సంక్షేమంకోసం పర్యటిస్తున్న సమయంలో ఆయన వాహనంపై కొంతమంది వైసిపి కార్యకర్తలు చెప్పులు, రాళ్లతో దాడి‌ చేయడం సిగ్గుచేటని... ఈ ఘటనను టిడిపి శాసనసభా పక్షం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జడ్ ప్లస్ భద్రత లో ఉన్న చంద్రబాబు పై జరిగిన దాడికి సిఎం జగన్, డిజిపి సవాంగ్ లు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గురువారం నాటి డిజిపి ప్రకటన‌ను చూసిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పక్షాలు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు. 

తమ పర్యటనకు పోలీసుల అనుమతి వుందని కాబట్టి పూర్తిస్థాయి భద్రత కల్పించాల్సిన బాధ్యత వారిపైనే వుంటుందన్నారు. కానీ పోలీసులే తమ బస్సుపై లాఠీ విసిరినట్లు అచ్చంనాయుడు ఆరోపించారు. అలా తమ వాహనంపై లాఠీలు వేసింది ఎవరో డిజిపి చెప్పాలని డిమాండ్ చేశారు. 

read more చంద్రబాబు ఓ నీచుడు...అందుకే చెప్పులతో స్వాగతం..: కొడాలి నాని

బాధ్యతాయుతమైన పదవుల్లో వున్న మంత్రులు ప్రతిపక్ష నేతపై గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. తమపై రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాడులు చేశారని చెబుతున్నారని అన్నారు. 

ఒకవేళ రాజధాని ప్రాంత ప్రజలకు ఆగ్రహం ఉంటే తాము పర్యటించిన అన్ని‌చోట్లా దాడులు జరగాలి కానీ ఒక్క సెంటర్ ను‌ ఎంచుకుని అక్కడే దాడి‌ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆ ఒక్కచోట తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లోప్రజలు తమకు సాదరస్వాగతం పలికారన్నారు.

భావ స్వేచ్చ అందరికీ ఉంటుందని డిజిపి అంటున్నారని... ఆయన అన్నట్లుగానే నిరసనకు అవకాశం ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. ఇకపై కూడా అందరికీ ఇదే విధంగా నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలని... సీఎం జగన్ పర్యటనలో కూడా తాము నిరసనలు తెలుపుతామన్నారు. అప్పుడు డిజిపి తమ నిరసనకు అనుమతి ఇవ్వకపోతే ఆయన్ని వైసిపి కార్యకర్తగా పరిగణిస్తామన్నారు. 

read more ఏపీ మంత్రిపై తేనెటీగల దాడి: పరుగులు పెట్టిన వైసీపీ నేతలు

మంత్రి బొత్సా సత్యనారాయణ పక్కన అనువాదకుడిని పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. టిడిపి ఇన్ సైడ్ ట్రేడింగ్ చేస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. చంద్రబాబుపై దాడి ఘటనను పార్లమెంటు లో కూడా ప్రస్తావిస్తామని అచ్చంనాయుడు వెల్లడించారు.