Asianet News TeluguAsianet News Telugu

మీడియాపై నిర్భయ కేసులు... జగన్ సర్కారు పనే: కొల్లు రవీంద్ర

మీడియా ప్రతినిధులపై అక్రమంగా నిర్భయ కేసులు పెట్టి ప్రభుత్వం బెదిరించేందుకు ప్రయత్నిస్తోందని.., మీడియాను చెక్కుచేతల్లో పెట్టుకోవాలనే ఇలా అక్రమ కేసులు బనాయిస్తున్నారని  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 

kollu ravindra reacts on nirbhaya case filed on media persons
Author
Amaravathi, First Published Jan 24, 2020, 6:45 PM IST

అమరావతి: వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ మీడియాపై కక్షసాధింపులకు పాల్పడుతోందని... రాజధాని ఆందోళనలు ప్రసారంచేస్తున్న టీవీఛానళ్ల వారిపై నిర్భయచట్టాన్ని మోపడం దారుణమని  టీడీపీనేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.  ప్రభుత్వ నిరంకుశ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు... మీడియా స్వేచ్చకు భంగం కలిగించవద్దని ప్రభుత్వానికి సూచించారు. 

శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మందడంలోని ఓ పాఠశాలలో విద్యార్థుల్ని బయటకు పంపి పోలీసులను ఉంచారని... వారు తరగతిగదుల్లో తమ బట్టలు ఉతికి ఆరేసిన దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై అక్రమంగా నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయడం ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు సంకేతమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మహిళా కానిస్టేబుల్లతో నిర్భయచట్టం కింద కేసుపెట్టించి విలేకరులను బెదిరించడం సరికాదన్నారు. జగన్‌ ప్రభుత్వం మీడియాను తన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు.

read more  చంద్రబాబు అలా చేయడం బాధించింది... అందుకే బయటకు...: పోతుల సునీత

దూషించిన మంత్రులను కట్టడిచేయకుండా, ఛైర్మన్‌ను తప్పుపడతారా? 

మండలి ఛైర్మన్‌ షరీఫ్‌పై వైసీపీ మంత్రులు దాడికి యత్నించడం, పరుష పదజాలంతో దూషించడం చేశారని... మైనారిటీ నేత, వయసులో పెద్దవాడని కూడా చూడకుండా వాడిన అసభ్య పదజాలం సభ్యసమాజం సైతం సిగ్గుపడేలా వున్నాయన్నారు.  

ఇలాంటి మంత్రులను ముఖ్యమంత్రి కట్టడిచేయకుండా మరింతగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారంటూ జగన్ పై రవీంద్ర మండిపడ్డారు. మండలి సాక్షిగా విజయసాయి, తదితరులు పెద్దలసభ సభ్యుల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. చట్టాలను సరిదిద్దే బాధ్యత మండలికి ఉందని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులన్నీ ఆమోదించాల్సిన అవసరం మండలికి లేదన్నారు. 

read more  ఆ వైసిపి ఎమ్మెల్యే కాళ్లు పట్టుకుంటానన్న కనికరించలేదు..: పంచుమర్తి అనురాధ ఆవేదన

రాష్ట్రప్రజల మనోభావాలకు అనుగుణంగానే మండలి నడుచుకుంటుందని, 71సీ నిబంధన ప్రకారమే రాజధాని తరలింపు బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని సెలెక్ట్‌ కమిటీకి పంపడం జరిగినట్లు రవీంద్ర పేర్కొన్నారు. మంత్రులు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఛైర్మన్‌ను ఉద్దేశించి వాడిన బూతులను ఎవరూ ఒప్పుకోరని రవీంద్ర అన్నారు. 

 
 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios