ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మధ్యపాన నిషేదంలో భాగంగా తీసుకువచ్చిన సవరణ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలని ఎక్సైజ్ శాఖమంత్రి నారాయణస్వామి అధికారులను ఆదేేశించారు. 

అమరావతి: మద్యపాన నిషేధం అమల్లో కొత్త సవరణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ మరియు వాణిజ్య పన్నుల శాఖామాత్యులు కె.నారాయణస్వామి అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయం సమావేశ మందిరంలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన డీసీ, ఏసీ, ఈఎస్, డీఎంలతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సందర్భంగా ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ... మద్యపాన నిషేధం అమలుపరుచుటలో అవకతవకలకు పాల్పడితే అధికారుల మీద కూడా చర్యలు తప్పదని హెచ్చరించారు. సూపర్ వైజర్, వాచ్ మెన్, సేల్స్ మెన్ లకు ఏజెన్సీల ద్వారా సక్రమంగా జీతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఐడీ, ఎన్ డీపీఎల్ కేసుల్లో పీడీ యాక్ట్ ను ఖచ్చితంగా అమలుపరచాలన్నారు. 

read more మహిళా గ్రామ వాలంటీర్ పై వేధింపులు... దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం

మద్యం అక్రమ రవాణా వాహనదారుల యజమానుల మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, లిక్కర్ ను ఔట్ లెట్స్ నుండి బార్లకు సరఫరా చేసిన కారణంగా నరసరావుపేట సీఐ ఎం.భుజంగరావును సస్పెండ్ చేస్తూ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఆదిశేషులుకు ఎక్స్ ప్లనేషన్ మెమో జారీ చేశారు. 

భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని... ఒకవేళ ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉపముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోరారు. 

సమావేశంలో కమిషనర్, డీఐజీ, స్పెషల్ సీఎస్, ఇన్ఫర్మేషన్ డైరెక్టర్, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన డీసీ, ఏసీ, డీఎంలు పాల్గొన్నారు.