Asianet News TeluguAsianet News Telugu

''అవసరమైతే ఎన్డీయేలో చేరతాం'' ఇది హెడ్డింగా...ఇంత దిగజారతారా..?: రామోజీరావుకు బొత్స లేఖ

తాను అనని మాటలను కూడా అన్నట్లుగా ఓ ప్రముఖ దినపత్రిక తప్పుడు వార్తను ప్రచురించిందని ఏపి పురపాలక మంత్రి  బొొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఆ పత్రికా యాజమాన్యానికి ఓ బహిరంగ లేఖ రాశారు. 

Botsa Satyanarayana Open Letter To Ramoji Rao
Author
Amaravathi, First Published Feb 15, 2020, 4:25 PM IST

అమరావతి: తన మాటలను వక్రీకరించి టిడిపి అనుకూలంగా వార్త రాయిస్తారా...? అంటూ ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామోజీరావును మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. తాను అనని మాటలను ఏకంగా తన దినపత్రికలో హెడ్డింగ్ గా పెట్టి ప్రచురించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ విషయంపైనే రామోజీరావుకు కు బొత్స బహిరంగలేఖ  రాశారు. 

బొత్స బహిరంగ లేఖ యధావిధిగా

రామోజీరావు గారికి...

ఈ రోజు ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో నేను అన్నట్టుగా ప్రచురించిన వార్తను చూసిన తరవాత ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఈ లేఖతోపాటుగా నిన్న నేను మాట్లాడిన వీడియోను కూడా మీ విలేకరికి ద్వారా మీకు పంపుతున్నాను. మీ తప్పుడు వార్తను వెనక్కు తీసుకుంటూ నా ఈ బహిరంగ లేఖకు అంతే ప్రాముఖ్యం ఇచ్చి ప్రచురించాలని కోరుతున్నాను. 

చంద్రబాబు, లోకేశ్‌ల సన్నిహితులమీద ఐటీ దాడుల్లో ఏకంగా వేల కోట్లు వెలుగు చూసిందంటున్న నేపథ్యంలో చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారించాలన్న డిమాండ్‌తో నేను విశాఖ పత్రికా సమావేశంలో మాట్లాడాను. ప్రధానమైన ఈ విషయం మీ పత్రికకు ప్రధాన వార్త కాలేదు. మీకు ఇలాంటి మాటలు రుచించవు. చంద్రబాబు ఎన్ని లక్షల కోట్లు మింగేసినా మీకు ఆయన అంటే ఉన్న దిక్కుమాలిన ప్రేమ గత మూడు దశాబ్దాలుగా మీ పత్రికలో నిత్యం కనిపిస్తూనే ఉంది. అది మీ ఇష్టం– తెలుగు ప్రజల దౌర్భాగ్యం. 

అలాగే డాక్టర్‌ వైయస్సార్‌గారిమీద, వైయస్‌ జగన్‌గారిమీద మీ వ్యతిరేకత, శత్రుత్వం ఏనాడూ మీరు దాచుకున్నది లేదు. అలాగని మేం అనని మాటల్ని మీ అజెండా ప్రకారం మార్చి ప్రచురించే స్థాయికి దిగజారి, చంద్రబాబు పార్టీని బతికించి రక్షించుకోవాలనుకుంటున్న మీ మానసిక స్థితిని ప్రశ్నించేందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. 

‘‘అవసరమైతే ఎన్డీయేలో చేరతాం’’అని నేను అన్నట్టుగా మీరు హెడింగ్‌ పెట్టారు. నేను ఆ మాటలు ఎక్కడ అన్నానో చూపించండి. ఈ హెడింగ్‌ పెట్టటం ద్వారా రెండు వైపులా పదునున్న కత్తిని మాకు వ్యతిరేకంగా వాడాం అని మీరు మురిసిపోతున్నట్టున్నారు. మొదటిది– నేను అనని ఈ మాటల్ని అన్నానని చెప్పటం ద్వారా, పూర్తిగా మా మీద నమ్మకంతో ఉన్న మైనార్టీలను రెచ్చగొట్టాలన్నది మీ దురాలోచన.

 రెండోది– ఈ వ్యాఖ్యలు మేం చేయలేదని ఖండిస్తే...  కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బ కొట్టవచ్చన్నది మీ రెండో దురాలోచన. నా వ్యాఖ్యల్ని వక్రీకరించి మీ మొదటి పేజీలో ప్రచురించిన తీరును చూస్తే  ఈ విషయం అర్థమవుతోంది. 

రాష్ట్ర ప్రయోజనాలు, ప్రధానంగా ఇక్కడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రయోజనాలు పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వం మాది. కేంద్రానికి–రాష్ట్రానికి మధ్య సత్సంబంధాలు ఉండాలని, కేంద్రం నుంచి అవసరం మేరకు నిధులు తెచ్చుకునేలా సంబంధాలు ఉండాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుంది. అందులో భాగంగానే ప్రధానిని, హోం మంత్రిని, కేంద్రంలోని పెద్దలను ముఖ్యమంత్రిగారు కలుస్తారన్నది కనీస జ్ఞానం ఉన్నవారికి అర్థం అవుతుంది. 

అదే సమయంలో రాజకీయ పార్టీలుగా ఎవరి భావాలు వారికి ఉంటాయి. మా నాయకుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు ప్రత్యేక హోదా కోసం 2014నుంచి నేటి వరకు అలుపెరుగని పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. వైయస్సార్‌ కాంగ్రెస్‌గా మా విధానాలు మావి. బీజేపీ విధానాలు వారివి. ఏ సిద్ధాంతాలూ లేని, ఎప్పుడు ఎవరితో అయినా కలిసి, విడిపోయి, మళ్ళీ కలిసిపోయే విధానం మీరు నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీది. మేం రాజకీయంగా మా స్వతంత్రాన్ని ఎప్పుడూ కాపాడుకుంటున్నా, వైయస్సార్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రోజుకో ప్రచారం చేయటం మీ విధానం. ప్రజలకు మంచి చేయటం చేతగాని చంద్రబాబును ఎలాగూ ప్రజల్లో పెంచలేరు కాబట్టి మమ్మల్ని చిన్నగీత చేయటానికి మీరు ఎంతగా దిగజారుతున్నారో ఆత్మపరిశీలన చేసుకోండి. 

ఎందుకు ఇంతగా దిగజారుతున్నారు? తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు, చంద్రబాబు ప్రయోజనాలు, మీ అందరి ఉమ్మడి ప్రయోజనాల కోసం అబద్ధాలు, కట్టుకథలతో ఇంకెంత కాలం మీ పత్రిక నడుపుతారు? చంద్రబాబు పర్సనల్‌ సెక్రెటరీ తీగ లాగుతుంటే కదులుతున్న వేల కోట్ల రూపాయల అవినీతి  డొంకను మీరెందుకు చూపించటం లేదు? ఇలాంటి వార్తల్ని దాచటం కూడా పత్రికా విలువల్లో భాగమేనా? ఇందులో జాతీయ ప్రయోజనాలు ఏమన్నా ఇమిడి ఉన్నాయా?  చంద్రబాబుకు 70. మీకు 84. 

ఇంత పండు వయసు వచ్చినా రాష్ట్రం గురించి కంటే మీ స్వప్రయోజనాల కోసమే రగిలిపోతున్న మీ వైఖరి వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మీ పాజిటివ్‌ కంట్రిబ్యూషన్‌ ఏమిటంటే చెప్పుకునేందుకు ఏమీ లేని పరిస్థితి తెచ్చుకున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పేరు చెపితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమూ లేదు... ఈనాడు పత్రిక వల్ల తెలుగు ప్రజలకు జరిగిన మేలు ఫలానా అంటే చెప్పేందుకూ ఏమీ మిగల్లేదు. ఎందుకీ పరిస్థితి వచ్చిందో మీరే ఆలోచించుకోండి. 

చివరిగా... మీ వార్త తప్పు, మీ ఆలోచన తప్పు. మీ పాలసీ తప్పు. చంద్రబాబును బతికించటం కోసం మీరు ఎంతటి అసత్యాలయినా పత్రికలో ప్రచురించటం తప్పు మాత్రమే కాదు... నేరం కూడా. మీ స్పందనను బట్టి నా తదుపరి కార్యాచరణ ఉంటుంది. 

– బొత్స సత్యనారాయణ


 

Follow Us:
Download App:
  • android
  • ios