ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిని రద్దుచేసిన ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు చెబుతున్నానంటూ టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అమరావతి: కేంద్రప్రభుత్వ నిధుల్ని వైసీపీ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలు, నాయకులకు పప్పుబెల్లాల్లా పంచిపెడుతోందని, గతప్రభుత్వంలో ఉపాధిహామీపథకం కిందపనులు చేసినవారికి అందాల్సిన సొమ్ముని దారిమళ్లించి తమ పార్టీ వారికి దోచిపెట్టే క్రతువుకు జగన్‌ సర్కారు తెరలేపిందని టీడీపీనేత, ఎమ్మెల్సీ వై.వీ.బీ.రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మండలినిరద్దు చేసి తమ పదవులు పోగొట్టి తమను ప్రజలపక్షాన నిలిపి, పదవుల్ని త్యాగంచేసే అవకాశం కల్పించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నట్లు వైవీబీ అభిప్రాయపడ్డారు.

మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలలకు, సచివాలయాలు, చిట్టచివరకు చెత్తకుండీలు, శ్మశానాలకు పార్టీ రంగులేసిన జగన్‌ సర్కారుకి హైకోర్టు నిర్ణయం చెంపపెట్టువంటిదన్నారు. రాష్ట్రప్రభుత్వం రంగులేయడానికే రూ.1300కోట్లు ఖర్చు చేసిందన్నారు. 

read more ఆంధ్రప్రదేశ్ యువతని వల్డ్ క్లాస్ స్కిల్ ఫోర్స్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం: గౌతమ్ రెడ్డి

వైసీపీ రంగులేయడానికి రూ.1300కోట్లుఖర్చయితే, కోర్టు ఆదేశాలతో అవి తొలగించడానికి తిరిగి మరో రూ.1300కోట్లు ఖర్చవుతుందని, మొత్తం గా రూ.2,600కోట్ల ప్రజాధనాన్ని వైసీపీప్రభుత్వం దుర్వినియోగంచేసిందని వై.వీ.బీ పేర్కొన్నారు. మండలి నిర్వహణకు రూ.60కోట్లు ఖర్చవుతుందని గగ్గోలుపెట్టిన జగన్‌, తనపార్టీ రంగులకోసం ఖర్చుచేసిన రూ.2,600కోట్లను తనసొంత నిధుల్లోంచి చెల్లిస్తారా అని టీడీపీనేత ప్రశ్నించారు. 

తాను అక్రమంగా సంపాదించిన సొమ్ములోంచి ఆమొత్తాన్ని మినహాయించాలన్నారు. రాజ్యాంగవిరుద్ధంగా గ్రామపంచాయతీలు, మండలపరిషత్‌ భవనాలకు, పాఠశాలలకు రంగులు వేయడం జరిగిందన్నారు. గ్రామపంచాయతీ భవనాలు గ్రామంలో నివసించే ప్రజలందరివీ అని, వాటికి పార్టీ రంగులేయడానికి వైసీపీ ప్రభుత్వానికి ఏం అధికారముందన్నారు. 

ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ రంగులేస్తూపోతే అలాంటి చర్యలకు అంతూపొంతూ ఉండదన్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు అత్యుత్సాహంతో రోడ్లవెంబడి ఉన్నచెట్లకు కూడా వైసీపీరంగులు వేశారన్నా రు. హైకోర్టు ఆదేశాలతో రంగులు మార్చడానికి అవసరమయ్యే నిధుల్ని జగన్‌ జేబులో నుంచే తీసి ఖర్చుపెట్టాలని వై.వీ.బీ డిమాండ్‌ చేశారు.కేంద్రనిధుల్ని వైసీపీప్రభుత్వం సొంతపథకాలకు వెచ్చిస్తోందన్నారు. 

టీడీపీ హాయాంలో ఉపాధిహామీపథకం కింద చేసిన అభివృద్ధిపనుల తాలుకా రూ.2500 కోట్ల నిధులు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు వేధించిందని, దానిపై కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. పాతబకాయిలు రూ.2,500కోట్లు ఇవ్వకుండా, కేంద్రం విడుదలచేసిన రూ.1700కోట్లను జగన్‌సర్కారు తన సొంతపథకాలకు వినియోగించుకుంటోందన్నారు. 

read more ఏపి మండలిరద్దుకు కేసీఆర్ సాయం...జగన్ కోసం క్షుద్ర పూజలు...: బుద్దా వెంకన్న సంచలనం

ఇళ్లస్థలాల చదునుకు ఎకరాకు రూ.కోటి, ఒక్కో సచివాలయం నిర్మాణానికి రూ.50లక్షల చొప్పున కేటాయించారని టీడీపీనేత తెలిపారు. గత ప్రభుత్వంలో పనులుచేసిన వారికి అందాల్సిన నిధుల్ని పందికొక్కుల్లా మింగేయడానికి వైసీపీ కార్యకర్తలు, నేతలు ఇప్పటికే సిద్ధమైపోయారని రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు.

గ్రామ,మండల, నియోజకవర్గస్థాయిలో ఉండే వైసీపీ నేతలు, కార్యకర్తలకు కూడా భవిష్యత్‌లో తమకు పట్టినగతే పడుతుందని, ఇప్పుడు వారు చేస్తున్నపనులకు నిధులు రాకుండా తాము కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని వై.వీ.బీ. హెచ్చరించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పారనే అత్యుత్సాహంతో పనులు చేసేవారంతా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదన్నారు.