Asianet News TeluguAsianet News Telugu

జగన్ సరికొత్త ప్లాన్: గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు నిర్ణయం

గ్రామ సచివాలయాల్లో ఒక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల నుంచి నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వం, యంత్రాంగం స్పందించడానికి ప్రత్యేక మెకానిజం ఉండాలని జగన్ ఆదేశించారు. అలాగే గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల సహకారాన్ని మహిళ సంక్షేమంలో తీసుకోవాలని సూచించారు. 
 

ap cm ys jagan mohanreddy review on woman welfare department
Author
Amaravathi, First Published Sep 9, 2019, 3:04 PM IST

అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ అందాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఇతర కారణాలతో వాటిని లబ్ధిదారులకు అందకుండా ప్రయత్నిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మహిళా శిశుసంక్షేమ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమల్లో అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల అమల్లో అనుసరిస్తున్న విధానాలు పథకాలను నిరాకరించేలా ఉండకూడదని స్పష్టం చేశారు. 


పథకాలు సంతృప్తికర స్థాయిలో లబ్ధిదారులకు అందించడానికి మాత్రమే కొన్ని విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక విధానాలు ఏవైనా లబ్ధిదారుడికి నో చెప్పడానికి కాదు అన్నారు. బయోమెట్రిక్‌ లేదా ఐరిస్‌ లేదా వీడియో స్క్రీనింగ్‌ ఇవన్నీ ఆ పథకం లబ్ధిదారుడికి చేరిందనే దానికి ఆధారం తప్ప, ఏ స్కీంనైనా నిరాకరించడానికి కాదన్నారు.  

గ్రామ సచివాలయాల్లో ఒక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల నుంచి నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వం, యంత్రాంగం స్పందించడానికి ప్రత్యేక మెకానిజం ఉండాలని జగన్ ఆదేశించారు. అలాగే గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల సహకారాన్ని మహిళ సంక్షేమంలో తీసుకోవాలని సూచించారు. 

ఈ సందర్భంగా 1008 కేసుల్లో వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన పరిహారం రూ.7.48 కోట్లను గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని బాధితులకు ఇవ్వలేదని సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు అధికారులు. 

అయితే  ఆనిధులను వెంటనే విడదుల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. పలు ఘటనల్లో బాధితులకు సహాయం చేయడానికి ఒక్కో జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయల చొప్పన నిధిని కేటాయించాలని ఆదేశించారు. బాల్య వివాహాల నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు.  

గ్రామ సచివాలయాల మాదిరిగా గ్రామ న్యాయాలయాల ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై  జగన్ ఆరా తీశారు. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు.  

భూ వివాదాలు, గ్రామాలలో నెలకొన్న వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు గ్రామ న్యాయాలయాలు ఎంతగానో ఉపయోగపడతయన్నారు. అలాగే 
స్కూళ్లలో చేరని విద్యార్థులపై అంగన్ వాడీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.  

అంగన్‌వాడీల నుంచి స్కూళ్లలో చేరని పిల్లలను వెంటనే గుర్తించి వారిని వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలన్నారు. సుమారు ఏడువేల మంది చిన్నారులు అంగన్‌వాడీల నుంచి స్కూళ్లలో చేరలేదని గుర్తించినట్లు అధికారులు స్పష్టం చేశారు. 

ఆరునెలలపాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి తర్వాత వారి సామర్థ్యాలనుబట్టి ఆయా తరగతుల్లో చేర్పించాలన్న సీఎం అధికారులకు సూచించారు. 
మిగతా పిల్లలతో సమానంగా రాణించేలా తగిన శ్రద్ధ పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  

మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళల్లో రక్తహీనత సమస్య పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
టెస్ట్‌ – ట్రీట్‌ – టాక్‌ విధానంలో ఈ రక్త హీనతను అధిగమించే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. 

రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించి వారికి పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని జగన్ ఆదేశించారు. వయసుకు తగ్గ బరువులేని వాళ్లు 17.2 శాతం వయసుకు తగ్గ ఎత్తు లేనివాళ్లు 30.2 శాతం ఉన్నట్లు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వారిపై ప్రత్యేక దృష్టిసారించాలని జగన్ ఆదేశించారు. 

ఇకపోతే గర్భవతులకు ఇచ్చే ఆహారంపైనా సీఎం జగన్ ఆరా తీశారు. రోజుకు రూ.22.5లు ఖర్చుచేస్తున్నామని జగన్ కు తెలిపారు అధికారులు. ఏయే సరుకులకు ఎంత ఖర్చుచేస్తున్నారో తెలియజేయాలని సూచించారు. 

గర్భవతులకు మరింత నాణ్యంగా, పౌష్టికరమైన ఆహారాన్ని అందించడంపై దృష్టిపెట్టాలని అందుకు నివేదిక రూపొందించాలని జగన్ ఆదేశించారు. పరిశుభ్రమైన, పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను కోరారు. 

మహిళా, శిశు సంక్షేమంలో గ్రామవాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టి ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.  త్వరలో ఇవ్వబోయే ఆరోగ్యశ్రీ కార్డులలో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  

అంగన్‌వాడీలపై ప్రత్యేక యాప్‌ తయారుచేయాలని శిశు సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు సీఎం జగన్. పిల్లలకు అందుతున్న భోజనం, వారి సంరక్షణపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని సూచించారు.  

అంగన్‌వాడీ వర్కర్లను మోటివేట్‌ చేయడంతోపాటు స్కూళ్ల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాలను బాగు చేయాలని సూచించారు. అలాగే అంగన్‌ వాడీ భవనాల సెంటర్ల స్థితిగతులపై కూడా పూర్తి స్థాయి నివేదిక సిద్ధంచేయాలని ఆదేశించారు. 

స్కూళ్లలో చేపడుతున్న నాడు – నేడు తరహాలో కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళిక తయారుచేయాలని సూచించారు. మూడేళ్లలో ఈ పనులు పూర్తి అయ్యేలా చొరవ చూపాలని కోరారు. ఎన్నారైలు, సంస్థలు, దాతల సహాయం తీసుకోవాలని ఆదేశించారు. అందుకోసం పోర్టల్‌ రూపకల్పన చేయాలని కోరారు. 

ఎవరు సహాయం చేసినా వారి పేర్లు పెడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కార్పొరేటు, వివిధ ప్రైవేటు సంస్థలకు పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. సీఎస్‌ఆర్‌ ద్వారా వారి భాగస్వామ్యానికి అవకాశాలు కల్పించాలని కోరారు. 

మద్యానికి బానిసలైన వారి కోసం కౌన్సెలింగ్‌ సెంటర్ల ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్ సెంటర్ల ఏర్పాటు కు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని  కోరారు. దివ్యాంగుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని వారికి ఎలాంటి పరికరాలు కావాలన్నా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios