అక్క అనుమానాస్పద మృతి: చెల్లె పరార్, వీడని మిస్టరీ
ఒక్క రాత్రి ఆ కుటుంబంతో తీరని విషాదాన్ని నింపింది. ఓ కూతురు అనుమానాస్పద రీతిలో చనిపోగా, మరో కూతురు కనిపించకుండా పోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Korutla
జగిత్యాల : కూతుర్లిద్దరూ ఒకరికొకరు తోడుగా వుంటారని నమ్మి తల్లిదండ్రులు బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్ళారు. కానీ రాత్రి ఏం జరిగిందో తెలీదు పెద్దకూతురు ఇంట్లో శవమై తేలగా చిన్నకూతురు ఓ యువకుడితో వెళ్ళిపోయింది. ఇలా ఇద్దరు కూతుళ్లు దూరంకావడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Korutla
వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం బీమునిదుబ్బలో నివాసముండే బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు ముగ్గురు పిల్లలు సంతానం. పెద్దకూతురు దీప్తి(24) సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండగా చిన్నకూతురు చందన బీటెక్ పూర్తిచేసి ఇంటివద్దే వుంటోంది. కొడుకు సాయి బెంగళూరులో చదువుకుంటున్నాడు. ఆనందంగా సాగుతున్న వీరి జీవితం ఒక్క రాత్రి పూర్తిగా మారిపోయింది.
Korutla
నిన్న (మంగళవారం) బంధువుల ఇంట శుభకార్యం వుండటంతో శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు హైదరాబాద్ కు వెళ్లారు. ఇంటినుండే పనిచేస్తున్న పెద్దకూతురు దీప్తి, చిన్నకూతురు చందన ఒకరికొకరు తోడుగా వుండటంతో రాత్రికి బంధువుల ఇంట్లోనే వున్నారు తల్లిదండ్రులు. కానీ ఆ రాత్రి ఏమయ్యిందో తెలీదు దీప్తి ప్రాణాలు కోల్పోగా, చందన కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి సోఫాలో కూతురు మృతదేహం కనిపించింది. చిన్నకూతురు గురించి ఎంత వెతికినా కనిపించలేదు. ఇలా ఇద్దరు కూతుళ్లు ఒకేసారి దూరం కావడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Korutla
శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో మద్యం బాటిల్స్ వుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అలాగే పోలీసులు కోరుట్ల బస్టాండ్ లోని సిసి కెమెరాలను పరిశీలించగా చందన తెల్లవారుజామున ఓ యువకుడితో కనిపించింది. దీంతో ఈ ఇద్దరూ కలిసే దీప్తిని చంపి పరారయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Korutla
పెద్ద కూతురును చిన్న కూతురే చంపివుంటుందన్న పోలీసుల అనుమానాన్ని తల్లిదండ్రులు మాత్రం నమ్మడంలేదు. దీంతో పోలీసులు దీప్తిది అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చందనతో పాటు వున్న యువకుడు ఎవరు? వారిద్దరూ ఎక్కడికి వెళ్లారు? అన్నది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారు దొరికితేనే దీప్తి హత్య మిస్టరీ వీడనుంది.
Korutla
కూతురు మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడే వున్నవారితో కన్నీరు పెట్టిస్తోంది. చిన్నకూతురు చందన భాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ పని చేసిందన్న అనుమానం ఆ తల్లిదండ్రులను మరింత బాధిస్తోంది.
Korutla
యువతుల తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డిఎస్పీ తెలిపారు. తెల్లవారుజామున 5.12 నిమిషాల నుండి 5.16 నిమిషాల వరకు చందన ఓ యువకుడితో కలిసి కోరుట్ల బస్టాండ్ లో వున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు నిజామాబాద్ బస్సులు ఆగేచోట వుండటం అక్కడికే వెళ్లివుంటారని అనుమానిస్తున్నారు. వారికోసం గాలిస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు.