IMD Rain Alert : రుతుపవనాలు అలర్ట్, ద్రోణి ఎఫెక్ట్ .. ఈ ప్రాంతాల్లో ఇక వర్షబీభత్సమే
Weather Update : మందగించిన రుతుపవనాలు అలర్ట్ అయ్యాయి.. ఇదే సమయంలో తెలంగాణ, ఏపీ మీదుగా ఓ ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకోనున్నాయని వాతావారణ శాఖ హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
IMD Rain Alert : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎండాకాలం ముగిసి వర్షాకాలంలోకి ఎంటర్ అయ్యాం... కానీ ఇంకా మండుటెండలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకినా పూర్తిగా విస్తరించకపోవడమే ఈ వాతావరణ పరిస్థితులకు కారణంగా నిపుణులు చెబుతున్నాయి. రాబోయే నాలుగైదు రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోతుందని... వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ చల్లనికబురు చెప్పింది.
తెలంగాణలో జోరువానలు..
ఇప్పటికే రుతుపవనాలు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చాయి... ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే రుతుపవనాలు కొన్నిచోట్లకు చేరుకోగా రాబోయే 4 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపింది. ఇదే సమయంలో తెలంగాణ మీదుగా ఏపీలోని కోస్తాంధ్ర వరకు ఓ ద్రోణి కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ప్రభావంతో నేడు (జూన్ 18, గురువారం) తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంబీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ. సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీచేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కూడా చెదురుమదురు జల్లులు కురుస్తాయని ప్రకటించింది.
ఇక మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. కాబట్టి వర్ష సమయంలో ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నేడు ఏపీలో వర్షాలు...
రుతుపవనాలకు ద్రోణి తోడవడంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నేడు (గురువారం) వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. పలు జిల్లాల్లో మేఘవృతమైన వాతావరణంతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని ప్రఖర్ జైన్ సూచించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో వర్షం మొదలవగానే పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశుకాపరులు అప్రమత్తం కావాలని... వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

