కేసీఆర్ షాక్: ఆర్టీసి సమ్మెపై మాట మార్చిన కేశవ రావు
ఆర్టీసీ సమ్మె విషయంలో టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎంతో చర్చించేందుకు ప్రయత్నిస్తోంటే సీఎం అందుబాటులోకి రాలేదని ఆయన ప్రకటించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని... ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు తేల్చి చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పరిస్థితులు చేజారి పోతాయనే అనుమానం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
మంగళవారం నాడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు హైద్రాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రెస్ నోటు విడుదల చేసే ముందు కానీ, ఆ తర్వాత కానీ తాను సీఎం కేసీఆర్ తో మాట్లాడలేదన్నారు.
సీఎం కేసీఆర్ తో తాను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. కానీ ఆయన తనకు అందుబాటులోకి రాలేదన్నారు. ప్రభుత్వంతో చర్చల విషయమై తాను చేసిన ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల్లో ఆశలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను చర్చలు జరుపుతానని అనలేదన్నార. అయినా సరే మంచి జరుగుతోందని అనుకొంటే తాను మధ్యవర్తిత్వం వహించేందుకు కూడ సిద్దంగా ఉన్నానని కేశవరావు తేల్చి చెప్పారు.
ఆర్టీసీ జేఎసీ తనతో చర్చలు జరిపేందుకు సానుకూలంగా ఉండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం ఆదేశిస్తే తాను ఆర్టీసీ కార్మికులతో చర్చించేందుకు సిద్దమని ఆయన స్పష్టం చేశారు.
ఇది పార్టీ సమస్య కాదన్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చించేందుకు తనకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి రాలేదన్నారు. తాను సోషలిస్టును రాజ్యం వైపు ఎప్పుడూ కూడ ఉండను, కార్మికుల పక్షానే తాను పోరాటం చేస్తానని కేశవరావు ప్రకటించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వం విలీనం చేస్తానంటే తనకు అభ్యంతరం ఎందుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిర్ణయం ఏమిటో తనకు తెలియదన్నారు. ప్రభుత్వ ఉద్దేశ్యం తెలిస్తే సమస్య పరిష్కారమయ్యేదని కేశవరావు అభిప్రాయపడ్డారు.