దుబ్బాక ఎఫెక్ట్: నాగార్జునసాగర్పై టీఆర్ఎస్ ఫోకస్
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో సాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ కేంద్రీకరించింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ ఇప్పటి నుండే ఫోకస్ పెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమితో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాకపోవడంతో టీఆర్ఎస్ నాయకత్వం నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. నర్సింహ్మయ్య అనారోగ్యంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. ఆరు మాసాలలోపుగా ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.
2018 తర్వాత హుజూర్నగర్, దుబ్బాక అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.హుజూర్నగర్ అసెంబ్లీ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ షాకిచ్చింది.
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిపై బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించారు. ఈ స్థానంలో బీజేపీ విజయం టీఆర్ఎస్ కు మింగుడుపడలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ బీజేపీకి అనుహ్యరీతిలో కార్పోరేట్ స్థానాలు దక్కడం టీఆర్ఎస్ కు షాకిచ్చింది.
దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో సీఎం కేసీఆర్ ఇటీవల సమావేశమయ్యారు.నాగార్జునసాగర్ లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాంపై పార్టీ నేతలతో ఆయన చర్చించారు.
నోముల నర్సింహ్మయ్య అంత్యక్రియలకు హాజరై వచ్చిన తర్వాత నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు సీఎం వరాలజల్లు కురిపించారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సీఎం మంజూరు చేశారు.కొండ్రపోల్ లిప్ట్ ఇరిగేషన్, నెల్లికల్లు లిప్ట్ ఇరిగేషన్, ఎఎంఆర్ హై, లో లెవల్ కెనాల్స్ కు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాలియాలో డిగ్రీ కాలేజీకి సీఎం అనుమతి ఇచ్చారు.
గతంలో ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ప్రాతినిథ్యం వహించారు. జానారెడ్డిపై గత ఎన్నికల్లో నోముల నర్సింహ్మయ్య విజయం సాధించారు.ఈ దఫా జానారెడ్డి పోటీ చేస్తారా.. ఆయన తనయుడు రఘువీర్ బరిలోకి దిగుతారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జానారెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయం సాధించాలని టీఆర్ఎస్ నాయకత్వం పట్టుదలతో ఉంది. అయితే ఈ నియోజకవర్గం నుండి పోటీకి బీజేపీ నాయకత్వం సన్నాహలు చేసుకొంటుంది.
ఈ స్థానంలో కూడా టీఆర్ఎస్ కు షాకివ్వాలని కమలదళం ప్లాన్ చేసుకొంటుంది. ఆ పార్టీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో త్వరలో తేలనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.నాగార్జునసాగర్ ను దక్కించుకోవాలని కాంగ్రెస్ కూడా ప్లాన్ చేస్తోంది.
నోముల నర్సింహ్మయ్య బతికున్న సమయంలో నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా కొందరు టీఆర్ఎస్ నేతలు వ్యవహరించారు. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఓ నేతను నర్సింహ్మయ్య పార్టీ నుండి సస్పెండ్ చేయించారు.
పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన నేతకు జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని నియోజకవర్గంలోని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం నెలకొంది.నాగార్జునసాగర్ స్థానం నుండి టీఆర్ఎస్ టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది కూడ ఆసక్తిగా మారింది.
దుబ్బాకలో కూడ సోలిపేట కుటుంబానికి టికెట్టు ఇవ్వడాన్ని స్థానికంగా ఉన్న కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. వారిని అప్పట్లో మంత్రి హరీష్ రావు బుజ్జగించారు. సాగర్ లోని పార్టీ నేతల మధ్య సమన్వయం ఎలా ఉందనే విషయమై కూడ పార్టీ నాయకత్వం ఆరా తీసే అవకాశం లేకపోలేదు.