జీహెచ్ఎంసీ రిజల్ట్స్ 2020: కారును వెంటాడిన బీజేపీ, టీఆర్ఎస్కి 6 వేల ఓట్లే అధికం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన ఫలితాలను బీజేపీ సాధించింది. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీకి మంచి ఉత్సాహన్ని ఇచ్చాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పోరేటర్ స్థానాలను కైవసం చేసుకొన్న బీజేపీ... టీఆర్ఎస్ కు సవాల్ విసిరింది. బీజేపీ కంటే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 6,066 ఓట్లు అధికంగా వచ్చాయి. బీజేపీకి 35.55 శాతం ఓట్లు వస్తే టీఆర్ఎస్ కు 35.73 శాతం ఓట్లు వచ్చినట్టుగా గణాంకాలు తెలుపుతున్నాయి.
2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 4 కార్పోరేట్ సీట్లు మాత్రమే దక్కాయి.ఈ ఎన్నికల్లో 48 స్థానాలు దక్కాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 34,44,093 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 79,735 ఓట్లు చెల్లలేదు. 28,661 ఓట్లు నోటాకు పోలయ్యాయి.
పోలైన ఓట్లలో టీఆర్ఎస్ కు 11,92,162 ఓట్లు దక్కాయి. బీజేపీకి 11,86,096 ఓట్లు వచ్చినట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన గణాంకాల తెలుపుతున్నాయి.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుపొందింది. టీఆర్ఎస్ తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. ఈ రెండు పార్టీల మధ్య పోలైన ఓట్ల శాతంలో కూడా స్వల్ప తేడా మాత్రమే ఉంది.
జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొంటామని బీజేపీ ధీమాతో ఎన్నికల బరిలోకి దిగింది.జీహెచ్ఎంసీ పీఠం దక్కించుకొనే మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ చాలా దూరంలో నిలిచింది. కానీ టీఆర్ఎస్ కు బీజేపీ చుక్కలు చూపింది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ తనవైపునకు తిప్పుకొంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం జీహెచ్ఎంసీలో దారుణంగా విఫలమైంది. రెండు కార్పోరేటర్ స్థానాలకే ఈ పార్టీ పరిమితమైంది.
గత ఎన్నికల సమయంలో కూడా ఆ పార్టీకి రెండు స్థానాలే ఉన్నాయి. మల్కాజిగిరి ఎంపీ పార్లమెంట్ పరిధిలోని రెండు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ క్యాడర్ ను మరింత నిరాశ పర్చాయి.జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో మార్పుకు నాంది పలకనున్నాయనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మెరుగైన విజయం సాధించలేదు. కానీ దుబ్బాక ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీ అనూహ్యంగా విజయం సాధించింది. .జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య స్థానాలను కైవసం చేసుకొంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు గాను బీజేపీ ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీ ఫలితాలతో ఆ పార్టీ మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది.