‘హిమాన్షు.. రా.. కలిసి ఉద్యమిద్దాం..మీ తాతను నిలదీద్దాం..’
హిమాన్షును టీజీవీపీలోకి రావాలంటూ నిజామాబాద్ లో పోస్టర్ వెలిసింది. టీజీవిపి జిల్లా అధ్యక్షుడు హిమాన్షును తమతో కలిసి పనిచేయాలని ఆహ్వానించారు.

kcr and himanshu Released Pigeon Into Sky
నిజామాబాద్ : కేటీఆర్ కొడుకు, కేసీఆర్ మనవడు హిమాన్షు చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీని మీద అనేక రకాలుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు అతని ప్రసంగాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ కేటీఆర్, కేసీఆర్ ల మీద విరుచుకుపడుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) హిమాన్షు ప్రసంగంపై వినూత్నంగా స్పందించింది. హిమాన్షును టార్గెట్ చేస్తూ ఒక పోస్టర్ను ముద్రించింది. దాంట్లో ఓవైపు హిమాన్షు ఫోటోవేసి అభినందనలు తెలుపుతూ.. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిని రాష్ట్రంలోని సమస్యలపై నిలదీద్దాం రావాలంటూ స్వాగతం పలికింది.
తెలంగాణలోని ఆ ఒక్క స్కూల్లోనే కాదు.. అన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితి. ఆ పరిస్థితిని మారుద్దాం. టీజీవీపీలోకి స్వాగతం.. కలిసి ఉద్యమిద్దాం..మీ తాతను నిలదీద్దాం’ అని ఫ్లెక్సీలో ముద్రించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై గురువారం నిజామాబాద్ లోని ఎన్టీఆర్ చౌరస్తాలో టీజీవిపి నిరసన తెలిపింది.
నిజామాబాద్ టీజీవిపి జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అద్వానంగా ఉందని.. పాఠశాలల్లో బెంచీలు సరిగా లేవని.. వర్షాలకు భవనాలపై పెచ్చులు ఊడిపోతున్నాయని.. కరెంట్ షాక్, పాము కాటుతో విద్యార్థులు మరణిస్తున్నారని…అంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమల పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు.. హిమాన్షు చేసిన పనితో కళ్ళు తెరవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ నగర అధ్యక్షుడు అఖిల్, దేవేందర్ లతో పాటు నేతలు ప్రశాంత్, సన్నీ, రాహుల్, మాధవ్, ధీరజ్, ఫణిందర్, రాకేష్, రాజేందర్ లు పాల్గొన్నారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ అంశంపై స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు చాలా నిజాయితీగా మాట్లాడాడు. శిథిలావస్థకు చేరుకున్న విద్యావ్యవస్థ మీద మాట్లాడడాన్ని స్వాగతిస్తున్నాను. బీఎస్పీ వాలంటీర్ గా చేరి పాఠశాల వ్యవస్థను తెలుసుకోవాలని హిమాన్షును కోరుతున్నాను. తాత, తండ్రి చూపించకుండా దాచిన ప్రపంచాన్ని నేను చూపిస్తా.
చాలామందికి హిమాన్షులాగే సేవ చేయాలని ఉంటుంది. అయితే హిమాన్షుకు వచ్చినంతగా సిఎస్ఆర్ ఫండ్స్ వారెవరికి రావడం లేదు. దాతలు సహకరించడం లేదు. హిమాన్షు త్వరలోనే తాతా, తండ్రి చేస్తున్న స్వార్ధ రాజకీయాలను తెలుసుకుంటాడని భావిస్తున్నాను’ అని అన్నారు.
హిమాన్షు హైదరాబాదులోని కేశవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. దానిని కోటి రూపాయల విరాళాలతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.